జగిత్యాల, మే 12 (నమస్తే తెలంగాణ): బంధాలను, అనుబంధాలను, మానవత్వాన్ని మంటగల్పిన కరోనా మహమ్మారి చివరికి కన్నవారి కడచూపునకు కూడా నోచుకోకుండా చేస్తున్నది. చివరికి అంత్యక్రియలను వీడియోకాల్లో చూసి కన్నీరు కార్చాల్సిన దుస్థితి నెలకొన్నది. ఓ మహిళ కరోనాతో మృతిచెందగా విదేశాల్లో ఉన్న ఆమె కొడుకు, కూతురు తల్లి చివరి చూపునకూ నోచుకోలేదు. జగిత్యాల పట్టణాని కి చెందిన కడలి రాధ-రామకృష్ణారావు దంపతులకు కొడుకు సంతోష్, కూతురు అర్చన ఉన్నారు. సంతోష్ అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా, అర్చన సింగపూర్లో ఉంటున్నారు. 20 రోజుల క్రితం రాధ కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. బుధవారం ఉదయం రాధ అంత్యక్రియలను ఆమె భర్త రామకృష్ణారావు నిర్వహించారు. విదేశాల్లో ఉన్న కొడుకు, కూతురు తల్లి అంత్యక్రియ లకురావడానికి వీలు కలుగలేదు. తండ్రి తన తల్లికి నిర్వహిస్తున్న అంత్యక్రియలను వీడియో కాల్లో చూసి కన్నీటి పర్యంతమయ్యారు.