ముంబై : ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న తరుణంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విరుచుకుపడటం అతిపెద్ద సవాల్ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది కరోనా మహమ్మారితో కుదేలై కోలుకుంటున్న ఆర్ధిక వ్యవస్థను కాపాడుకుంటూ ముందుకు సాగడం కీలకమని వ్యాఖ్యానించారు. రికవరీకి తోడ్పడేలా ఊతమిచ్చే ధోరణిలో ద్రవ్య విధానం సానుకూలంగా ఉండాలని అన్నారు.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తో పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ లు, ఇతర నియంత్రణల ఫలితంగా ఆర్ధిక వ్యవస్థ పెరుగుదలపై అస్పష్టత నెలకొందని చెప్పారు. ఇక 2021-22 ఆర్ధిక సంవత్సరంలో వృద్ధి రేటును 10.5 శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది. అంతర్జాతీయ వృద్ధి రేటు ఆశాజనకంగా ఉంటుందనే అంచనాలు భారత్ ఎగుముతులు, పెట్టుబడుల వాతావరణానికి ఊతమిస్తాయని అన్నారు.