హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని లక్షలాది రజక, నాయీబ్రాహ్మణ కుటుంబాలకు సర్కారు ఊరటనిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సెలూన్లు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ పథకం కింద రూ.198 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో నాయీబ్రాహ్మణ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్కు రూ. 97.20 కోట్లు, వాషర్మెన్ కోఆపరేటివ్ సోసైటీస్ ఫెడరేషన్కు రూ. 100.80 కోట్లు విడుదల చేశారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 2 లక్షల రజక కుటుంబాలు, రెండున్నర లక్షల నాయీబ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి కలుగనున్నది. జీవో జారీతో రజక, నాయీబ్రాహ్మణ సంఘాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. తమను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, అవమానాలకు గురిచేసిన సీఎంలే ఉన్నారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమను అక్కున చేర్చుకున్నారని సంఘాల ప్రతినిధులు కొనియాడారు. కులవృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమను ఆదుకున్న నాయకుడివెంట, పార్టీ వెంట తాముంటామని చెప్పారు.
కష్టసుఖాలు తెలిసిన నేత సీఎం కేసీఆర్
అన్ని వర్గాల కష్టసుఖాలు తెలిసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్. దేశంలోనే ఏ రాష్ట్రంలో రజకులకు ఉచిత విద్యుత్తు పథకం లేదు, దాన్ని మాకు వర్తింపజేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
-కొండూరి సత్యనారాయణ, తెలంగాణ రజక సంఘాల సమితి సలహాదారు
మా బరువు దించిన దేవుడు కేసీఆర్
సెలూన్ల నిర్వహణ భారం పెరిగి ఆందోళనకర పరిస్థితుల్లో ఉంటే మాకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని తెచ్చి మా బరువును దించిన దేవుడు సీఎం కేసీఆర్. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.
-రాచమల్ల బాలకృష్ణ, తెలంగాణ నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు