న్యూఢిల్లీ: భారత్కు 215 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపుతున్నట్లు కువైట్ తెలిపింది. మరో 1,400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. “మూడు భారత యుద్ధ నౌకలు, ఒక పెద్ద వాణిజ్య నౌక మొత్తం 215 మెట్రిక్ టన్నుల వైద్య ద్రవ ఆక్సిజన్ను తీసుకువస్తున్నాయి. శనివారం నుంచి ముంబై, గుజరాత్ నౌకాశ్రయాలకు చేరుకుంటాయి ” అని భారత్లోని కువైట్ రాయబారి జసేమ్ ఇబ్రహీం అల్ నజీమ్ తెలిపారు. సముద్ర మార్గం ద్వారా ఆక్సిజన్ తరలింపు కొనసాగుతుందని, భారత యద్ధ నౌకలు తిరిగి కువైట్కు వెళ్తాయని, మూడు వారాల్లో 1,400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేస్తామని ఆయన చెప్పారు.
మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే అతిపెద్ద కంపెనీలున్న దేశాల్లో కువైట్ ఒకటని, రోజువారీ ఉత్పత్తి దాదాపు 200 టన్నులు అని అల్ నజీమ్ తెలిపారు. ఇరాక్, జోర్డాన్, సౌదీ అరేబియా వంటి దేశాలకు ద్రవ ఆక్సిజన్ను అందిస్తున్నామని చెప్పారు. స్నేహపూర్వక దేశమైన భారత్లో ఆక్సిజన్ అవసరాన్ని గుర్తించామని, కరోనా మహమ్మారిపై పోరాడటానికి సమిష్టి ప్రయత్నాల్లో భాగంగా భారతదేశానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు.
ప్రపంచ మహమ్మారి కరోనా ప్రారంభ దశలో భారతదేశం తమకు అండగా నిలిచిందని, గత ఏడాది ఏప్రిల్లో సైనిక వైద్య బృందాన్ని కువైట్కు పంపిందని అల్ నజీమ్ గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా 2,00,000 డోస్ల కోవిడ్ -19 వ్యాక్సిన్ను భారత్ సరఫరా చేసిందని చెప్పారు. పరస్పర సహకారం రెండు దేశాల మధ్య సాంప్రదాయ స్నేహపూర్వక సంబంధాల కంటే ఎక్కువ అని, సమస్యలు, సంక్షోభాల సమయంలో ఇరు దేశాలు కలిసి ఉంటాయని కువైట్ రాయబారి పేర్కొన్నారు.