హైదరాబాద్: ఇంజినీర్ల నైపుణ్యం, చిత్తశుద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి విశ్వాసం ఉంచారని ఆర్ అండ్ బీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో బుధవారం నిర్వహించిన ఇంజినీర్ల దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశ ముఖచిత్రం మార్పులో ఇంజినీర్ల పాత్ర కీలకమని కొనియాడారు.
రాష్ట్రంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులను రికార్డు స్థాయిలో పూర్తి చేయడంలో ఇంజినీర్లు విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అద్భుతాలు సృష్టించారని ఈ సందర్భంగా ప్రశంసించారు. అనుకున్న సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కీలకంగా పనిచేశారని గుర్తు చేశారు. యాదాద్రి ఆలయం చరిత్ర పుటల్లో నిలుస్తుందని అన్నారు.
హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. అనంతరం నీటి పారుదల శాఖకు చెందిన బి. హరిరాం (కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్)కు ఉత్తమ ఇంజినీర్ అవార్డును మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ రమణ నాయక్, అంజయ్య, బ్రహ్మరెడ్డి , శ్రీధర్ దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.