న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి కొనసాగుతూనే ఉన్నది. ఒక పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికీ.. మరో పక్క కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అంతకంంతకే పెరుగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో ఆ ఏడు రాష్ట్రాల్లోనే 87.73 శాతం కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఆదివారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 15,602 కొత్త కేసులు నమోదు కాగా.. కేరళలో 2,035, పంజాబ్లో 1,510 మంది కరోనా బారినపడ్డారు. దేశవ్యాప్తంగా 161 మంది కరోనా రోగులు మృతిచెందారు. మృతుల్లో మహారాష్ట్రకు చెందినవారు 88 మంది, పంజాబ్కు చెందినవారు 22 మంది, కేరళకు చెందినవారు 12 మంది ఉన్నారు. దేశంలోని 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు నమోదుకాలేదు.