న్యూఢిల్లీ, మే 22: ‘అల్లోపతి ఓ పిచ్చి శాస్త్రం (స్టుపిడ్ సైన్స్). అల్లోపతి మందులు తీసుకొన్న లక్షల మంది చనిపోయారు. రెమ్డెసివిర్, ఫావిఫ్లూ కూడా ఆ మందులే. కరోనా చికిత్సలో వాటితో పాటు మరికొన్ని అల్లోపతి మందులకు డీసీజీఐ ఆమోదం తెలిపింది. కానీ అవన్నీ విఫలమయ్యాయి’ అని యోగా గురువు రాందేవ్ బాబా వ్యాఖ్యానించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం తెలిపింది. వైద్యులను, వైద్య శాస్ర్తాన్ని రాందేవ్ బాబా అవమానించారని ఆరోపించింది. అల్లోపతిపై ఏ మాత్రం అవగాహన లేకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు సమాజానికి హాని చేస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాను అవకాశంగా తీసుకొని ప్రజల్లో భయాలు సృష్టించి, ఏ మాత్రం శాస్త్రీయత లేని తన ఔషధాలు అమ్ముకోవడానికి రాందేవ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
రాందేవ్ ఆ మాట అనలేదు
యోగా గురువు రాందేవ్ బాబాకు ఆధునిక వైద్యశాస్త్రం పట్ల, వైద్యుల పట్ల ఎలాంటి వ్యతిరేక భావన లేదని పతంజలి యోగపీఠ ట్రస్టు తెలిపింది. ‘అల్లోపతి పిచ్చి సైన్సు’ అని రాందేవ్ బాబా అన్నట్టు ఐఎంఏ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలో.. ఆయన ఓ ఫార్వర్డ్ మెసేజ్ను చదువుతున్నారని, అయితే ఆ మాటలను రాందేవ్ బాబానే సొంతంగా అన్నట్టు తప్పుగా అర్థం చేసుకొన్నారని తెలిపింది.