హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): మామిడి రైతుకు సెర్ప్ అండగా నిలుస్తున్నది. మామిడి తోటల నుంచే నేరుగా పంటను సేకరిస్తూ అన్నదాతకు అనేక రకాల ప్రయోజనాలను చేకూరుస్తున్నది. ఈ ఏడాది 13 జిల్లాల నుంచి 2వేల టన్నుల మామిడి సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నది. రైతులతో ఏర్పాటైన రాష్ట్రస్థాయి ఫెడరేషన్ బేనిషాన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా సెర్ప్ వీటిని సేకరిస్తున్నది. ఈ ఏడాది ఇప్పటికే రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేయడం ప్రారంభించిన సెర్ప్ దానిని ఢిల్లీ, సహా ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నది. రాష్ట్రంలోని హోల్ సెల్ మార్కెట్లకు విక్రయిస్తున్నది. ఈ ఏడాది ఫ్లిప్కార్ట్ కూడా మామిడి వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో సెర్ప్ను సంప్రదించి తమకు కూడా మామిడిని సరఫరా చేయాలంటూ విజ్ఞప్తి చేసింది. రిలయన్స్, బిగ్ బాస్కెట్, రత్నదీప్, బోయినపల్లి మార్కెట్లకు కూడా అందజేస్తున్నారు. 2019లో నాలుగు జిల్లాల్లో సెర్ప్ద్వారా 92 మెట్రిక్ టన్నుల మామిడిని సేకరించారు. గతేడాది కరోనాతో ఆటంకం ఏర్పడినప్పటికీ.. ఏడు జిల్లాల్లో 634 మెట్రిక్ టన్నులు సేకరించారు. ఈసారి 13 జిల్లాల్లో 2 వేల టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జగిత్యాల, నాగర్కర్నూలు, మంచిర్యాల, వరంగల్ రూరల్, సిద్దిపేట, సూర్యాపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, జనగామ, ఖమ్మం, వనపర్తి, మహబూబాబాద్ జిల్లాల నుంచి పంటను సేకరించనున్నారు. ఇప్పటికే మొదటి విడత సేకరణ ప్రారంభం కాగా.. రైతులు కూడా బెనిషాకే విక్రయించడానికి మొగ్గు చూపుతున్నారు. తమవద్ద కొనుగోలుచేయాలని రైతులు పెద్దఎత్తున విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి.
మామిడిని హైదరాబాద్ మార్కెట్కు తీసుకెళ్లి చాలాసార్లు నష్టపోయాం. లారీ, డీసీఎం ఖర్చులతోపాటు, అక్కడ 10 నుంచి 12 శాతం కమిషన్ తీసుకుంటరు. ఒక టన్ను కాయకు క్వింటా తరుగుతీస్తరు. ఇలా అన్నిరకాలుగా రైతుకు నష్టమే. సెర్ప్ ద్వారా రైతుల వద్దకే నేరుగా వచ్చిన పంటను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులపై రవాణా భారం తగ్గింది. సెర్ప్వాళ్లు ఇంకా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రైతులకు ఎంతో లాభం జరుగుతుంది.
-పెబ్బేటి బొక్కలయ్య, కల్వకోలు, నాగర్కర్నూలు జిల్లా
మా తోటతోపాటు మరికొందరిది ఎనిమిది ఎకరాలను కౌలుకు తీసుకున్నా. సెర్ప్ వాళ్లు రేటు కూడా బాగానే ఇస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే ఒకసారి మా దగ్గర కాయ తీసుకపోయారు. ఈసారి క్రాప్ తక్కువ ఉండటంతో రేటు ఎక్కువగా ఉన్నది. మామిడి అత్యధికంగా పండే కొల్లాపూర్ ఏరియాలో మార్కెట్ ఏర్పాటు చేస్తే ఇంకా మంచిగ ఉంటది.
– సీ హెచ్ సత్యనారాయణ యాదవ్, కల్వకోలు నాగర్ కర్నూలు జిల్లా .