హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): తెల్ల రేషన్కార్డుదారులకు ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఉచితంగా 10 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కొత్తగా రేషన్కార్డులు పొందినవారికి కూడా ఆగస్టు నుంచే బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కొత్త కార్డుదారుల కోసం బియ్యం సేకరణ, కేటాయింపుల నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి జరగాల్సిన బియ్యం పంపిణీని 3వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. పాత కార్డుదారులకు గత నెల కేంద్రం కోటా ప్రకారం ఇవ్వాల్సిన 5 కేజీలను కలిపి ఆగస్టులో 15 కేజీలను పంపిణీ చేస్తామన్నారు. సెప్టెంబర్ నెల నుంచి మళ్లీ యథావిధిగా 10 కేజీలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం కొత్తగా 3,09,083 కుటుంబాలకు రేషన్కార్డులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 90.50 తెల్లకార్డులు, 2.88 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ ఉచిత బియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.416.34 కోట్ల ఖర్చు పెరుగుతుందని మంత్రి గంగుల వివరించారు.