అమరావతి, జూన్ ,18: రోడ్డు ప్రమాదంలో ఇద్దరినీ మృత్యువు కబళించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంక (గాంధీనగరం) చెందిన జనసేన జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు చోడిశెట్టి చంద్రశేఖర్ సోదరి సింగలూరి వీరధనలక్ష్మి తన భర్త శ్రీనివాస్ కుమార్తె కావ్యతో కలిసి చెముడులంక నుంచి విశాఖ జిల్లా కారులో వెళుతుండగా విశాఖపట్నం సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో కుమార్తె కావ్య, ధనలక్ష్మి మృతిచెందగా భర్త శ్రీనివాస్ కు తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
శ్రీనివాస్ ధనలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా ఒక కుమార్తె సుప్రజ బెంగుళూరులో వైద్యురాలుగా పనిచేస్తుంది. తండ్రి ఆసుపత్రుల్లోనూ తల్లి, చెల్లి మరణించిన వార్త సుప్రజకు తెలిసిన వెంటనే హుటాహుటిన చెముడులంక చేరుకొని, విశాఖపట్నంలో మృతదేహాలకు పోస్టుమార్టం జరిగిన అనంతరం చెముడులంకకు తరలించి అక్కడ నుంచి బడుగువానిలంక గౌతమి గోదావరి చెంతన గల పుష్కర ఘాట్ వద్ద వారి అంత్యక్రియల్లో పాల్గొని తలకొరివి పెట్టింది. ఆ కుటుంబం ఒకే సారి ఇద్దర్నీ కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.