నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్10 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రికార్డు స్థాయిలో రుణాల మంజూరు, రుణ పరిమితుల పెంపు లాంటి కీలక నిర్ణయాలతో సేవలకు పెద్దపీట వేసింది. బ్యాంకు లావాదేవీల్లో కీలకమైన ఎన్పీఏను బాగా తగ్గించగలిగారు. దీంతో కొత్త బ్రాంచీల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యినట్లే. మొత్తంగా బ్యాంకు వార్షిక టర్నోవర్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఒక్క సంవత్సరంలోనే రూ.291కోట్లు పెరిగింది. 2020-21 వార్షిక ప్రగతి నివేదికను డీసీసీబీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్రెడ్డి నల్లగొండలోని బ్యాంకు కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు.
రూ.1060 కోట్ల నుంచి..
పాలకవర్గం పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏడాదిలో రూ.291 కోట్ల అదనపు టర్నోవర్ సాధించినట్లు తెలిపారు. గతేడాది రూ.1060కోట్ల టర్నోవర్ ఉండగా ఈ మార్చి చివరి నాటికి రూ.1351కోట్లకు పెరిగినట్లు వివరించారు. ఇందులో షేర్ క్యాపిటల్ను రూ.61కోట్ల నుంచి రూ.70కోట్లకు పెంచినట్లు తెలిపారు. డిపాజిట్ల సేకరణపైనా ప్రత్యేక దృష్టి పెట్టి రూ.400కోట్ల నుంచి రూ.458కోట్లకు పెంచగలిగామని వివరించారు. బ్యాంకు పురోగతిలో కీలకమైన నాన్ పర్ఫార్మింగ్ ఆస్తుల (ఎన్పీఏ) విలువ శాతం 6.55 శాతం నుంచి 3.99శాతానికి తగ్గించామన్నారు. ప్రస్తుత ఎన్పీఏ విలువ తగ్గించడం ద్వారా పోచంపల్లి, చిట్యాల, నల్లగొండ వన్టౌన్లతోపాటు మరికొన్ని చోట్ల కొత్తగా బ్యాంకు బ్రాంచీలను ఏర్పాటు చేయడానికి మార్గం సుగుమమయ్యిందన్నారు.
రికార్డు స్థాయిలో పంట రుణాలు
నాలుగు శాతం వడ్డీకే ఈ నిధులు ఇస్తున్నందున సకాలంలో చెల్లించిన సొసైటీలకు మూడు శాతం రిబేటు కూడా వర్తింస్తుదని తెలిపారు. అదేవిధంగా ఈ ఏడాది లక్ష్యానికి మించి మొత్తం రూ.600 కోట్ల పంట రుణాలు ఇవ్వగా అందులో రికార్డు స్థాయిలో 200 కోట్ల కొత్త రుణాలు ఇచ్చామని వెల్లడించారు. ఇక కన్మల్ రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు, ఎస్హెచ్జీలకు రూ. 7 నుంచి రూ.10 లక్షలకు, పంట రుణాలు గరిష్ఠంగా రూ. లక్ష నుంచి రూ.3 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్సు ప్రీమియాన్ని పూర్తిగా బ్యాంకు నుంచే చెల్లిస్తూ రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచినట్లు తెలిపారు. హౌసింగ్ రుణాన్ని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచామన్నారు. బ్యాంకు అభివృద్ధిలో మంత్రులు జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్రెడ్డి, పాలకవర్గసభ్యుల పాత్ర కీలకమని చెప్పారు. డీజీఎం నర్మద తదితరులు పాల్గొన్నారు.
రూ.3 కోట్ల నికర లాభం
ఇక బ్యాంకు ఈ ఏడాది రూ.3.07కోట్ల నికర లాభాన్ని కూడా ఆర్జించినట్లు వెల్లడించారు. ఏడాదిలో ఇంతటి లాభం కూడా ఇదే తొలిసారన్నారు. ఇక ఈ ఏడాది నాబార్డు రాష్ట్రంలోని తొమ్మిది డీసీసీబీలకు రూ.18 కోట్లు సబ్సిడీ రుణం ఇస్తే అందులో రూ.14 కోట్లను సిబ్బంది కృషితో నల్లగొండ డీసీసీబీనే వాడుకోగలిందని తెలిపారు. ఈ రుణాలతో జిల్లా రైతాంగం 25నుంచి 33శాతం వరకు సబ్సిడీతో కోళ్లఫారాలు, చెక్డ్యాంలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు లభించిందన్నారు.