హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చైల్డ్ఇన్ఫోలో పేర్లు నమోదైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేయనున్నారు. పాఠ్య పుస్తకాల దుబారా, వృధాను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి 25 లక్షల మంది విద్యార్థులకు1.48 కోట్ల పుస్తకాలు అవసరమని అధికారులు తేల్చారు. ఇందులో 1.02 కోట్ల (72శాతం) పాఠ్య పుస్తకాలను ఇప్పటికే జిల్లాలకు చేర్చారు. వీటిలో హైదరాబాద్కు 89 శాతం, మేడ్చల్మల్కాజిగిరి 88, రంగారెడ్డి 83, నిజామాబాద్ 79, వరంగల్ అర్బన్ 77, వరంగల్ రూరల్ జిల్లాలకు 75 శాతం చొప్పున పాఠ్యపుస్తకాలు చేరాయి. వాస్తవానికి వీటిని జూన్కల్లా జిల్లాలకు చేర్చాలని అధికారులు భావించారు.లాక్డౌన్ కారణంగా సాధ్యపడలేదు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం పునశ్చరణ నిర్వహిస్తున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి రెగ్యులర్ పాఠాలు ప్రారంభమవుతాయి. ఆలోగా ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయనున్నారు.
ఉచిత పాఠ్యపుస్తకాల వివరాలు
మొత్తం విద్యార్థులు 25,54,434
కావాల్సిన పుస్తకాలు 1,48,40,726
ఇప్పటికే జిల్లాలకు చేరినవి 1,02,68,100
జిల్లాలో ఉన్న పాత నిల్వ 5,71,966
జిల్లాలకు ఇంకా చేర్చాల్సినవి 40,31,140