యాదాద్రి, మార్చి14: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహోత్సవాలు సోమవారం నుంచి ఈ నెల 25 వరకు జరుగనున్నాయి. ఈ నెల 21న ఎదుర్కోలు, 22న ఉదయం 10 గంటలకు బాలాలయంలో, సాయంత్రం 7:30 గంటలకు కొండ కింద పాత ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో స్వామివారి తిరుకల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 23న ఉదయం 11 గంటలకు దివ్య విమాన రథోత్సవం.. సాయంత్రం 7 గంటల నుంచి 7:30 గంటలకు స్వామివారి బాలాలయంలో, రాత్రి 8 గంటల నుంచి కొండ కింద వైకుంఠద్వారం నుంచి దేవస్థాన ప్రచార రథం ఊరేగిస్తారు. 25న ఉదయం స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు స్వామివారి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ నెల 22 జరిగే కల్యాణోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హాజరుకానున్నట్టు ఆలయ ఈవో గీత తెలిపారు.