మహిళా చైతన్యం ఉవ్వెత్తున ఎగిసింది. ఇంట, బయట, పనిచేసే చోట మొదలుకొని దేశ పార్లమెంట్ భవనంలో సైతం తమపై జరుగుతున్న దాడులు, వేధింపులు, వివక్షను ప్రశ్నిస్తూ స్త్రీ లోకం ఉద్యమబాట పట్టింది. ‘మార్చ్ 4 జస్టిస్’ పేరిట వేలాది మంది ఆస్ట్రేలియన్ మహిళలు సోమవారం చేపట్టిన నిరసన ప్రదర్శనలు, నినాదాలతో కాన్బెర్రా, మెల్బోర్న్, బ్రిస్బేన్, హోబార్ట్ వంటి నగరాలు దద్దరిల్లాయి. 2019లో ఆస్ట్రేలియా పార్లమెంటు భవనంలో అటార్నీ జనరల్ క్రిస్టియన్ పోర్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని మాజీ ప్రభుత్వ సలహాదారురాలు బ్రిటానీ హిగిన్స్ ఇటీవల ఆరోపించడం తెలిసిందే. ఈ క్రమంలో పని ప్రాంతాల్లో మహిళల పట్ల జరుగుతున్న లైంగిక దాడులను ప్రశ్నిస్తూ.. పలు మహిళా స్వచ్ఛంద సంస్థలు ‘మార్చ్ 4 జస్టిస్’ పేరిట ఈ ర్యాలీలను నిర్వహిస్తున్నాయి. మహిళలపై హింస, వివక్షను చూపే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.