యువకుడి అరెస్ట్
రాంనగర్, ఏప్రిల్ 30: కరోనా రోగులకు ప్లాస్మా డొనేట్ చేస్తానంటూ మోసం చేస్తున్న ఓ యువకుడిని కరీంనగర్ టాస్క్ఫోర్స్, త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. త్రీటౌన్ సీఐ విజ్ఞాన్రావు వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో ప్లాస్మా కోసం చేస్తున్న విజ్ఞప్తులను గమనించి మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన భూక్యా బాలచందర్ వారిని ఫోన్లో సంప్రదించేవాడు. ప్లాస్మా ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ప్రయాణ చార్జీలు పంపిస్తే వస్తానని నమ్మ బలికేవాడు. అనంతరం డబ్బులు తీసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడు. ఇలా నమ్మి మోసపోయిన బాధితులు కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్, త్రీటౌన్ పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కరోనా పేరుతో బాధితులను మోసగిస్తే చర్యలు తప్పవని సీపీ కమలాసన్రెడ్డి హెచ్చరించారు.