తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఉన్నది. ఆ విషయాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరిచిపోయి వ్యవహరిస్తున్నది. వారి పరిధిలోకి రాదనే రీతిలో తెలంగాణపై కక్ష కట్టింది. సవతి తల్లి ప్రేమ చూపుతూ.. నిధుల రూపంలో వాతలు పెడుతున్నది. బీజేపీ అనుకూల రాష్ర్టాలకు నిధుల వరద పారిస్తూ.. తెలంగాణకు మొండిచేయి చూపుతున్నది. మిగతా రాష్ర్టాల్లో చేపడుతున్న ప్రాజెక్టులకు మెజార్టీ వాటా కేటాయించి.. వెంటనే నిధులు విడుదల చేస్తుండగా.. తెలంగాణకు మాత్రం పదిశాతం వాటానే కేటాయించి.. వాటిని ఇచ్చేందుకు దశాబ్ద కాలంగా దాటవేస్తూనే ఉన్నది. మొదటి దశ మెట్రో రైలు నిర్మాణ పనులకు చెందిన నిధులే ఇప్పటివరకు ఇవ్వని కేంద్రం.. ఇక రెండవ దశకు ఎప్పుడు ఇస్తుందని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. మీకు అనుకూలంగా ఉంటేనే నిధులిస్తారా..? లేకుంటే మొండిచేయి చూపుతారా.? అంటూ మండిపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవతితల్లి ప్రేమను చూపుతున్నది. కొత్త ప్రాజెక్టులకు నిధుల ఊసెత్తకపోగా, ఇస్తామన్న ప్రాజెక్టులకు నిధులను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఇందుకు ప్రత్యేక నిదర్శనం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ ప్రైవేటు పార్టనర్షిప్(పీపీపీ) ప్రాజెక్టుగా రికార్డులకెక్కిన హైదరాబాద్ మెట్రో రైలుపై కేంద్రం వివక్ష చూపుతున్నది. ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం వయా గ్యాప్ ఫండ్ రూపంలో ఇస్తామన్న వాటా రూ.1458 కోట్లు కాగా 2012 నుంచి ఇప్పటివరకు రూ.1200కోట్లు మాత్రమే కేటాయించి ఇంకా రూ.258 కోట్లు పెండింగ్లోనే పెట్టింది. కానీ దేశంలోని ఇతర మెట్రో రైలు ప్రాజెక్టులకు మాత్రం కేంద్రం ఉదారంగా నిధులు కేటాయిస్తున్నది. అందుకు దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన మెట్రో ప్రాజెక్టునే ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.25863.81 కోట్లు కేటాయించింది. ఇక బెంగళూరు మెట్రో ప్రాజెక్టుకు రూ.10569.51 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయగా., ఇతర ఆర్థిక సంస్థల నుంచి రూ.7694.57కోట్లు విడుదల చేయించింది. చెన్నై, అహ్మదాబాద్, లక్నో మెట్రో రైలు ప్రాజెక్టులకైతే వేల కోట్ల రూపాయలు విడుదల చేసింది. పీపీపీ విధానంలో చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ రూ.14వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తే అందులో 10శాతంగా ఇవ్వాల్సిన రూ.1458 నిధుల్లో కేవలం రూ.1200 కోట్లు మాత్రమే కేటాయించి చేతులెత్తేసింది. పెండింగ్ నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గత మూడేండ్లుగా కేంద్రాన్ని అడుగుతున్నా.. కేంద్రం ఆ ఊసే ఎత్తకపోవడంతో నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలోనే అతి పెద్ద మెట్రో రైల్ నెట్ వర్క్ నిర్మాణానికి కేంద్రమే మెజార్టీ భాగాన్ని భరించగా, ఆ తర్వాతి స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వం వాటాగా రావాల్సిన నిధులను విడుదల చేసేందుకు దశాబ్దకాలం పడుతున్నది. 2012లో నిర్మాణ పనులు మొదలవ్వగా.. 2017 నవంబర్ నుంచి దశల వారీగా మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు 69కి.మీ పొడవుతో దేశంలోని ఢిల్లీ మెట్రో తర్వాత హైదరాబాద్ మెట్రో అతి పెద్ద మెట్రోగా నిలిచినా, కేంద్రం ఇవ్వాల్సిన 10శాతం వాటా మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు. దీనిపై రాష్ట్ర ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. మెట్రో మొదటి దశ ప్రాజెక్టుకే నిధుల కేటాయింపు సకాలంలో చేయకపోతే, ఇక తర్వాత చేపట్టే మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు ఎంతవరకు ఇస్తారనే దానిపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ మహానగరానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అటకెక్కించింది. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఇతర రాష్ర్టాలకు నిధుల విడుదల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తూ, తెలంగాణ పట్ల ఎందుకీ వివక్ష చూపుతున్నదని పలువురు ప్రశ్నిస్తున్నారు.