హైదరాబాద్ : తెలంగాణలో నాలుగు రకాల విప్లవాలు ప్రారంభమయ్యాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఅర్ నాయకత్వంలో తెలంగాణలో రెండో హరిత విప్లవం, మత్స్య పరిశ్రమలో నీలి విప్లవం, గొర్రెల పెంపకంతో పింక్ విప్లవం, పాడి పరిశ్రమలో శ్వేత విప్లవం మొదలైనట్లు వెల్లడించారు. తెలంగాణ వ్యవసాయరంగంలో సంక్షోభం నుండి సంవృద్ధి వైపు సాధించిన విజయంలో వ్యవసాయశాఖ పనితీరు అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కొనియాడారు.
వ్యవసాయరంగంపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంగళవారం సమావేశమై వ్యవసాయరంగంపై చర్చించింది. సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇల్లంతకుంట ప్రాంతం ఒకప్పుడు దుర్భిక్షానికి చిరునామా ఉండే. నేడు అక్కడ లక్ష టన్నుల దిగుబడి సాధ్యమైంది. రాష్ట్రం శక్తిని మార్చే సత్తా వ్యవసాయరంగానికి ఉందన్నారు. రెండు కోట్ల పైచిలుకు జనాభా ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా వ్యవసాయరంగం నుండి ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు.
రైతు అంటే చిన్నచూపు పోయిందన్న మంత్రి వ్యవసాయరంగాన్ని లాభసాటి రంగంగా మార్చాలని తెలిపారు. వ్యవసాయం పరిశ్రమగా మార్చేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను బలోపేతం చేయాలన్నారు. ఇందుకోసం ప్రొఫెసర్ స్వామినాథన్, జయతీ ఘోష్, పాలగుమ్మి సాయినాథ్, సుభాష్ పాలేకర్ ను మంత్రి వర్గ ఉపసంఘం సంప్రదించాలన్నారు. అమెరికాలోని అయోవాలో ఉన్న అగ్రికల్చర్ మ్యూజియంను అధికారుల బృందం సందర్శించాలన్నారు. 32 జిల్లాలలో 50 నుండి 100 ఎకరాలలో డెమానిస్ట్రేట్ ఫార్మ్ లు ఏర్పాటుకు యోచిద్దామన్నారు.
వేరుశనగ, టమాటా వంటి వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం కేంద్రంగా నవీన ఆవిష్కరణలు రావాలన్నారు. చదువురాని వారు కూడా స్మార్ట్ ఫోన్ల రాకతో ఎంతో అవగాహన పెంచుకున్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగం పెరగాలన్నారు. రైతులకు ఫ్యాబ్లెట్ లు అందించే అవకాశాలను పరిశీలించాలన్నారు. డ్రోన్లు, ఇతర వ్యవసాయ ఆవిష్కరణల వైపు యువతను ప్రోత్సహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో అందుబాటులో ఉన్న వ్యవసాయ యంత్రాల వివరాలను ఉబరైజేషన్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. మూడు శాతం జనాభా ఆధారపడ్డ అమెరికా వ్యవసాయ రంగం నుండి ఆ దేశ జీడీపీలో తొమ్మిది శాతం సంపద సమకూరుతుందన్నారు.