హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఏపీలోని విశాఖ జిల్లా మధురవాడలో ఓ ఎన్నారై కుటుంబం సజీవదహనమైంది. నలుగురు అనుమానాస్పదంగా అగ్నికి ఆహుతయ్యారు. బహ్రెయిన్లో స్థిరపడిన విజయనగరం జిల్లా గంట్యాడకు చెందిన బంగారు నాయుడు (50), నిర్మల (46), దీపక్ (22), కశ్యప్ (19) నాలుగేండ్ల కిందట విశాఖకు వచ్చారు. ఎనిమిది నెలల కిందటే మిథిలాపురి కాలనీలోని ఓ అపార్టుమెంట్లో కిరాయికి దిగారు. బంగారు నాయుడు భార్య నిర్మల హోమియో వైద్యురాలు. పెద్ద కుమారుడు ఎన్ఐటీలో డిగ్రీ పూర్తిచేసి సివిల్స్కు సిద్ధమవుతుండగా, చిన్న కొడుకు కశ్యప్ ఇంటర్ చదువుతున్నాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక అపార్ట్మెంట్లో పెద్దఎత్తున మంటల చెలరేగి, పొగలు కనిపించడంతో స్థానికులు..పోలీసులకు సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకునేలోపే అపార్టుమెంట్లోని ఇంట్లో ఉన్న నలుగురు సజీవదహనమయ్యారు. కుటుంబకలహాలతోనే ఈ ఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలంలో రక్తపు మరకలు ఉండటం అనుమానాలకు తావిస్తున్నది. హత్యచేసి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. కేసునమోదు చేసిన విశాఖ పోలీసులు.. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా కక్షతో ఎవరైనా హత్యచేశారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.