హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): వైద్యరంగంలో దక్షిణ భారతదేశం మొత్తాన్ని తనవైపే తిప్పుకొంటున్న హైదరాబాద్ మహానగరం, త్వరలోనే యావత్దేశానికి ఆరోగ్య రాజధానిగా మారనున్నది. కరోనా సంక్షోభ కాలంలో తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల్లోని బాధితులంతా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కే తరలివచ్చారు. ఎంతమంది వచ్చినా ఇక్కడ మెరుగైన వైద్యసేవలు అందాయి. తాజాగా నగరం నాలుగు మూలల్లో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ దవాఖానలు నిర్మించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. నగరంలో ఇప్పటికే ఉన్న ఉస్మానియా, గాంధీ దవాఖానలకు తోడు కొత్త దవాఖానలు ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. కరోనా రోగులకు ఇప్పటికే సేవలందిస్తున్న గచ్చిబౌలిలోని టిమ్ను సూపర్ స్పెషాలిటీ దవాఖానగా మార్చనున్నారు. దీనితోపాటు కొత్తపేటలోని పండ్ల మార్కెట్ స్థలంలో, ఛాతీ దవాఖాన ప్రాంగణంలో ఒక్కోటి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని అల్వాల్-ఓఆర్ఆర్ మధ్య మరో అత్యాధునిక ప్రభుత్వ దవాఖానలు నిర్మించాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. కొత్తపేటలోని కూరగాయల మార్కెట్ను ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్గా అభివృద్ధిచేయాలని మంత్రివర్గం తీర్మానించింది.
కరోనా మొదటి వేవ్ సమయంలో కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ను రికార్డు సమయంలో దాదాపు 1,500 పడకలతో దవాఖానగా మార్చిన విషయం తెలిసిందే. దానిని పూర్తిస్థాయిలో సూపర్స్పెషాలిటీ దవాఖానగా అభివృద్ధిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ంమొత్తానికి హైదరాబాద్ నగరం ఆయువుపట్టుగా ఉండటంతో రోజురోజుకు జనాభా పెరుగుతున్నది. అందరికీ మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రస్తుతం ఉన్న గాంధీ, ఉస్మానియా దవాఖానలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. నగరం నలుమూలల దూరప్రాంతాలకు విస్తరించటంతో ఈ దవాఖానలకు రోగులు వచ్చిపోవాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ఈ పరిస్థితిని నివారించేందుకు నగరం నలువైపుల అత్యాధునిక దవాఖానలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి అందుబాటులోకి వస్తే ప్రజలకు తాము నివాసం ఉన్న ప్రాంతంలోనే ఉచితంగా కార్పొరేట్ వైద్యం లభిస్తుంది. హైదరాబాద్ నగరం ఇప్పటికే ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలున్న ప్రైవేటు దవాఖానలకు నిలయంగా ఉన్నది. తాజాగా నాలుగు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు అందుబాటులోకి వస్తే దేశం నలుమూల నుంచి రోగులు తరలివచ్చే అవకాశం ఉంటుందని వైద్యరంగ నిపుణులు చెప్తున్నారు. కాగా, కొత్తపేటలో ప్రస్తుతం ఉన్న కూరగాయల మారెట్ను పూర్తిగా ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మారెట్గా మార్చాలని క్యాబినెట్ నిర్ణయించింది.
రాష్ట్రంలో గతేడాది వరిధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నుల పై చిలుకు వచ్చిందనివ్యవసాయశాఖ క్యాబినెట్కు తెలిపింది. ఈ వర్షాకాల సీజన్లో ఇప్పటికే ఈనెలలో సాధారణ వర్షపాతం కంటే 60 శాతం ఎకువ వానలు పడ్డాయని, గతేడాది కంటే 5 శాతం ఎకువగా వర్షాపాతం నమోదయ్యిందని వివరించింది. గతేడాది పండిన వరిధాన్యంలో 1.4 కోట్ల టన్నులు ప్రభుత్వం సేకరించిందని, 1.6 కోట్ల టన్నుల ధాన్యాన్ని వ్యాపారులు కొన్నారని పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు, కరోనా కష్టకాలంలో కూడా రికార్డుస్థాయిలో ధాన్యం సేకరించిన పౌర సరఫరాలు, గ్రామీణాభివృద్ధి, సంబంధిత శాఖల అధికారులు సిబ్బందిని క్యాబినెట్ అభినందించింది. ఈ వానాకాలం సీజన్లో సాగు పెట్టుబడి కోసం రైతుబంధు సగదు రూ.5,145 కోట్లు రైతుల ఖాతాల్లో ఇప్పటికే జమ అయ్యాయని వ్యవసాయశాఖ తెలిపింది.