హైదరాబాద్ : మార్కెట్లను రద్దు చేస్తే రైతులకు ఇబ్బందులు ఏర్పడుతాయి అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో వ్యవసాయ పద్దులపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడారు. ఈ రోజు రైతులకు మార్కెట్ల సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెట్లను రద్దు చేస్తామన్న కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లను తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు రైతులను సీఎం ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. రాష్ర్టంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసిందన్నారు.
నీటి లభ్యత పెరగడం వల్ల పంటల దిగుబడి కూడా పెరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 103 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించుకున్నామని తెలిపారు. రైతుబంధు పథకంతో రైతులు సంతోషంగా ఉన్నారు. రైతుబీమా పథకం రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందన్నారు. రైతుల రుణాలను త్వరలోనే మాఫీ చేస్తామన్నారు. గ్రామ, మండల, రాష్ర్ట స్థాయిలో రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. రైతులు తమ సమస్యలను చర్చించుకునేందుకు రైతు వేదికలను నిర్మించుకున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసు చేసుకుని సాదా బైనామాల ద్వారా రైతులకు పాస్బుక్లు అందించారు అని తెలిపారు. ధరణి పోర్టల్లో ఎలాంటి సమస్యలు లేవని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు.