హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): అపోహలు పటాపంచలవుతున్నాయి. అనుమానాలు తొలగిపోతున్నాయి. కరోనా టీకాలు పనిచేస్తాయో లేదోనన్న భయాలు అక్కరలేదని వ్యాక్సిన్లే నిరూపిస్తున్నాయి. కొవిడ్-19ను టీకాలు సమర్థంగా ఎదుర్కొంటున్న వాస్తవాలు కండ్లముందు కనిపిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా టీకాలు వేసుకొన్నవారంతా సురక్షితమేనని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కరోనా సెకండ్వేవ్ తీవ్రమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అర్హులంతా ఆలస్యం చేయకుండా టీకాలు తీసుకోవాలని పై రెండు ఉదాహరణలు చెప్పకనే చెప్తున్నాయి.
రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకునే వారి సంఖ్య ఇప్పటికే పెరుగుతున్నది. కొవిన్ యాప్లో రిజిస్ట్రర్ చేసుకొని, సమీప కేంద్రాల్లో వ్యాక్సిన్ వేసుకొంటున్నారు. వ్యాక్సిన్ సామర్థ్యంపై నిర్వహించిన అధ్యయనాలన్నీ సానుకూలంగానే ఉన్నాయి. దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు. ఇవి రెండూ కొంచెం అటుఇటుగా వైరస్ నియంత్రణలో 80% సామర్థ్యం చూపిస్తున్నట్టు నిపుణులు తేల్చారు. అంటే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న రెండువారాల తర్వాత వైరస్ బారినపడే అవకాశం 80% వరకు తగ్గుతుంది.
వ్యాక్సిన్ తీసుకొన్నవారికి వైరస్ సోకినా పెద్దగా ప్రభావం చూపించటంలేదని పలు దవాఖానల్లో నిర్వహించిన కేస్ స్టడీలు స్పష్టంచేస్తున్నాయి. ఎలాచూసినా వ్యాక్సిన్ వల్ల లాభమేగానీ నష్టంలేదని వైద్యు లు చెప్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలకంటే భారత్లో టీకా కార్యక్రమం నెమ్మదిగా సాగుతున్నది. ఇలాగే కొనసాగితే మొత్తం జనాభాకు టీకాలు వేయటానికి రెండేండ్లు పడుతుందని, ఆలోపు వైరస్ వల్ల తీవ్ర నష్టం జరుగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టీకాతో ఒక్కరూ చనిపోలేదు
కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకొనేందుకు మనచేతుల్లో ఉన్న ఏకైక అస్త్రం టీకాయేనని వైద్య నిపుణులు అంటున్నారు. అపోహలు వీడి టీకాలు వేసుకొనేందుకు ముందుకు రావాలని సూచిస్తున్నారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్లలో ఏది తీసుకున్నా కరోనా నుంచి రక్షణ కల్పిస్తున్నాయని స్పష్టంచేస్తున్నారు. కరోనా వల్ల ప్రపంచంలో ఇప్పటివరకు 28 లక్షల మంది చనిపోయారని, వ్యాక్సిన్ వల్ల చనిపోయిన కేసు ఒక్కటికూడా లేదని స్పష్టంచేస్తున్నారు. స్వల్ప దుష్ప్రభావాలకు బెదిరి వ్యాక్సిన్కు దూరంగా ఉంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు.
వ్యాక్సిన్ తీసుకున్నాక యాంటిబాడీలు పెరిగాయి
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న మూడు వారాల తర్వాత యాంటిబాడీస్ పరీక్ష చేయించుకున్నాను. ఉండాల్సిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ ప్రతిరక్షకాలు ఉన్నట్టు రిపోర్టులో తేలింది. వైరస్ను ఎదుర్కొనే ప్రతిరక్షకాలు వ్యాక్సిన్ రూపంలో అభివృద్ధి చెందటం వల్ల మనకు రక్షణ దొరుకుతుంది. నాలాంటి ఉదాహరణలు చాలా చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నమ్మకం పెరుగుతుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మర్చిపోవద్దు.
–జీ శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్
వైరస్ సోకినా సీరియస్ కాదు
వివిధ రాష్ర్టాల్లో కొవిడ్ కేసుల తీరు పరిశీలిస్తే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 81% వరకు కరోనా సోకడం లేదు. 19% మందికి సోకే అవకాశం ఉన్నప్పటికీ వారిపై వైరస్ పెద్దగా ప్రభావం చూపటంలేదు. వైరస్ను ఎదుర్కొనే ప్రతిరక్షకాలు శరీరంలో ఉంటాయి కాబట్టి వైరస్ శరీర అవయవాలకు పెద్దగా నష్టం చేయడంలేదు. ముఖ్యంగా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటున్నాయి. వైరస్ వ్యాప్తి కూడా ఇలాంటివారి ద్వారా జరగటం లేదని తెలుస్తున్నది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.
–డాక్టర్ కిరణ్ మాదాల, క్రిటికల్ కేర్ నిపుణుడు
వేగం పెంచాలి
మనదేశంలో వ్యాక్సినేషన్ వేగం పెంచాలి. వ్యాక్సిన్ కేంద్రాలను పెంచడంతోపాటు అన్ని వయసులవారికి టీకాలు వేయాలి. కనీసం 70 కోట్ల మందికి వ్యాక్సిన్ అందినప్పుడే సామూహిక రోగనిరోధకత (హెర్డ్ ఇమ్యూనిటీ) మొదలవుతుంది. ఇందుకు వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడంతోపాటు ట్రయల్స్ పూర్తిచేసుకొన్న ఇతర వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావాలి.
–డాక్టర్ రంగారెడ్డి బుర్రి,
ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ అధ్యక్షుడు