వనస్థలిపురం, అక్టోబర్ 10: స్వర్ణకారులు రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యారంగాల్లో రాణించాలని అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని వనస్థలిపురంలో నిర్వహించిన తెలంగాణ స్వర్ణకారుల సంఘం రాష్ట్ర నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతామని చెప్పారు. స్వర్ణకార వృత్తిలో ఎదుగుతున్నవారిని ప్రోత్సహించాలని సూచించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వింజమూరి రాఘవాచారి నూతన కమిటీతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్రాచారి, చేపూరి వెంకటస్వామి, చంద్రశేఖర్, కన్నెగంటి సత్యం, కీసరి శ్రీకాంత్, రాఘిఫనీ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.