మందకొడి పిచ్పై ఇతర ఆటగాళ్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న వేళ ‘మిస్టర్ 360’ ఏబీ డివిలియర్స్ విజృంభించాడు. చినుకులా ప్రారంభించి.. వరదలా జోరందుకొని.. ఆఖరికి పరుగుల సునామీ సృష్టించడంతో బెంగళూరు భారీ స్కోరు చేస్తే.. హెట్మైర్, రిషబ్ పంత్ మెరుపులతో పోటీలో నిలిచిన ఢిల్లీ చివరికి ఒక పరుగు తేడాతో ఓటమి పాలైంది. పంత్ సేనకు హ్యాట్రిక్ విజయాల తర్వాత ఇది తొలి ఓటమి కాగా.. గత మ్యాచ్లో చెన్నై చేతిలో చతికిలబడ్డ బెంగళూరు.. తిరిగి గెలుపు బాటపట్టింది.
అహ్మదాబాద్: ఇసుక తుఫాను అంతరాయం మధ్య సాగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీపై బెంగళూరుదే పైచేయి అయింది. గత మ్యాచ్లో చెన్నై చేతిలో షాక్ తిన్న కోహ్లీ సేన మంగళవారం ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటితే.. హైదరాబాద్పై సూపర్ ఓవర్లో నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఈసారి ఒక్క పరుగు తేడాతో పరాజయం వైపు నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ (42 బంతుల్లో 75 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులకు పరిమితమైంది. హెట్మైర్ (25 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ రిషబ్ పంత్ (58 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధశతకాలతో పోరాడినా ఫలితం లేకపోయింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ రెండు, జెమీసన్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. డివిలియర్స్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఏబీ దంచుడు..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (12), దేవదత్ పడిక్కల్ (17) త్వరగానే ఔటవడంతో పవర్ ప్లే ముగిసేసరికి బెంగళూరు 36/2తో నిలిచింది. మ్యాక్స్వెల్ (25; ఒక ఫోర్, 2 సిక్సర్లు), రజత్ పాటిదార్ (31; 2 సిక్సర్లు) నిలకడగా ఆడటంతో కోహ్లీ సేన కోలుకోగలిగింది. మిడిలార్డర్లో వచ్చిన డివిలియర్స్ ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డట్లు కనిపించినా.. ఆఖరికి వచ్చేసరికి విశ్వరూపం ప్రదర్శించాడు. 35 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్న ఏబీ.. స్టొయినిస్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మూడు సిక్సర్లు సహా 23 పరుగులు రాబట్టడంతో బెంగళూరు మంచి స్కోరు చేయగలిగింది.
చివర్లో ఉత్కంఠ..
ఛేదనలో శిఖర్ ధవన్ (6), స్టీవ్ స్మిత్ (4) త్వరగానే ఔటైనా.. రిషబ్ పంత్ బాధ్యతాయుతంగా ఆడాడు. అతడికి కాసేపు పృథ్వీ షా (21) సహకరించాడు. పృథ్వీతో పాటు స్టొయినిస్ (22)ను హర్షల్ ఔట్ చేయగా.. పంత్ తన శైలికి భిన్నంగా నిదానంగా ఆడాడు. దీంతో సాధించాల్సిన రన్రేట్ పెరిగిపోయింది. అయితే హెట్మైర్ రాకతో ఇన్నింగ్స్లో వేగం వచ్చింది. సిరాజ్ ఓవర్లో 6,4 కొట్టిన హెట్మైర్.. జెమీసన్ ఓవర్లో 3 సిక్సర్లు అరుసుకొని 23 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఢిల్లీ విజయానికి చివరి ఓవర్లో 14 పరుగులు అవసరం కాగా.. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ పకడ్బందీ బౌలింగ్తో 12 పరుగులే ఇచ్చి బెంగళూరుకు విజయాన్ని కట్టబెట్టాడు.
1 ఐపీఎల్లో తక్కువ (3288) బంతుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా డివిలియర్స్ రికార్డుల్లోకెక్కాడు. వార్నర్ (3554 బంతుల్లో) రెండో స్థానంలో ఉన్నాడు.
స్కోరు బోర్డు
బెంగళూరు: కోహ్లీ (బి) అవేశ్ 12, పడిక్కల్ (బి) ఇషాంత్ 17, రజత్ (సి) స్మిత్ (బి) అక్షర్ 31, మ్యాక్స్వెల్ (సి) స్మిత్ (బి) మిశ్రా 25, డివిలియర్స్ (నాటౌట్) 75, సుందర్ (సి అండ్ బి) రబడ 6, సమ్స్ (నాటౌట్) 3, ఎక్స్ట్రాలు: 2, మొత్తం: 171/5. వికెట్ల పతనం: 1-30, 2-30, 3-60, 4-114, 5-139, బౌలింగ్: ఇషాంత్ 4-1-26-1, రబడ 4-0-38-1, అవేశ్ 4-0-24-1, మిశ్రా 3-0-27-1, అక్షర్ 4-0-33-1, స్టొయినిస్ 1-0-23-0.
ఢిల్లీ: పృథ్వీ షా (సి) డివిలియర్స్ (బి) హర్షల్ 21, ధవన్ (సి) చాహల్ (బి) జెమీసన్ 6, స్మిత్ (సి) డివిలియర్స్ (బి) సిరాజ్ 4, పంత్ (నాటౌట్) 58, స్టొయినిస్ (సి) డివిలియర్స్ (బి) హర్షల్ 22, హెట్మైర్ (నాటౌట్) 53, ఎక్స్ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 170/4. వికెట్ల పతనం: 1-23, 2-28, 3-47, 4-92, బౌలింగ్: సమ్స్ 2-0-15-0, సిరాజ్ 4-0-44-1, జెమీసన్ 4-0-32-1, సుందర్ 4-0-28-0, హర్షల్ 4-0-37-2, చాహల్ 2-0-10-0.