ముంబై : ఇద్దరు టాంజానియా వ్యక్తులు దేశంలోకి రూ 13.35 కోట్ల విలువైన కొకైన్ ను తరలిస్తూ ముంబై ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు వెల్లడించాయి. నిందితులు 101 క్యాప్సుల్స్ లో కొకైన్ ను కుక్కి వాటని తమ శరీరంలో దాచి దేశంలోకి తీసుకువస్తున్నారనే సమాచారంతో డీఆర్ఐ అధికారులు దాడులు చేపట్టారు. నిందితులను కార్లోస్ ఆదం, రషీద్ పాల్ సయుల గా గుర్తించారు. టాంజానియా నుంచి వీరు ముంబై వస్తూ అధికారులకు పట్టుబడ్డారు. వీరు తమ శరీరంలోపల దాచి మత్తు పదార్ధాలను భారత్ లోకి తీసుకువస్తున్నారనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
వీరిని కోర్టు అనుమతితో వైద్య పరీక్షల కోసం జేజే ఆస్పత్రికి తరలించగా వీరి కడుపులో విదేశీ పదార్ధాలున్నాయని వైద్యులు గుర్తించారు. క్యాప్సుల్స్ లో కొకైన్ నింపి వాటిని మింగామని నిందితులు అంగీకరించారు. ఈ తరహాలో పలువురు డ్రగ్ దందాను సాగిస్తున్నారని డీఆర్ఐ దర్యాప్తులో వెల్లడైంది. ఈ తరహా ముఠా మెడికల్ వీసాపై దేశంలోకి వచ్చి మత్తు పదార్ధాలను విక్రయిస్తున్నారని తేలింది. మెడికల్ వీసాను ఆఫ్రికా దేశాలకు చెందిన పలువురు దుర్వినియోగం చేస్తున్నారని వెల్లడైనట్టు డీఆర్ఐ వర్గాలు తెలిపాయి.