ఖమ్మం, మే 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్,(నమస్తే తెలంగాణ): సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య(87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఖమ్మంలో అంత్యక్రియలు నిర్వహించారు. కాశయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఈయన స్వగ్రామం మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు. కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్, జనతా పార్టీల నుంచి రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలుపొందారు. 1987లో ఖమ్మం జడ్పీ చైర్మన్గా పోటీచేసి మాజీ మంత్రి జలగం ప్రసాదరావుపై గెలుపొందారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు సన్నిహితుడిగా.. అంతరంగికుడిగా కాశయ్య పేరొందారు. మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, తెలంగాణ అభ్యుదయవాదిగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నిస్వార్థ రాజకీయనేతగా చేకూరిని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. కాశయ్య మరణంతో నిజాయితీ కలిగిన ఒక సీనియర్ రాజనీతిజ్ఞుడిని రాష్ట్రం కోల్పోయిందని విచారం వ్యక్తంచేశారు. కాశయ్య మృతికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపాన్ని ప్రకటించారు