హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ)ః ప్రముఖ సాహితీవేత్త , మిసిమి పత్రిక సంపాదకుడు అన్నపరెడ్డి వెంకటేశ్వర్రెడ్డి (89) మంగళవారం హైదరాబాద్లో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన అన్నపరెడ్డి దశాబ్దాలుగా మిసిమి సాహిత్య పత్రికను నిర్వహిస్తున్నారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనస్తత్వ శాస్త్రం, బౌద్ధ సాహిత్యాన్ని ఆయన తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. అధ్యాపకుడిగా పనిచేస్తూనే సాహిత్యంలో విశేషమైన కృషి చేశారు. ఆయన మృతిపట్ల రచయితలు, సాహితీప్రియులు సంతాపం తెలిపారు. అన్నపరెడ్డి అంత్యక్రియలు హైదరాబాద్ మదీనాగూడలో బుధవారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.