హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్లో జరుగబోయే ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయమని మాజీ మంత్రి ఈటల రాజేందర్కు, బీజేపీ నేతలకు అర్థమైంది. మామూలుగా మర్యాదగా మాట్లాడతారన్న ఈటల.. గత కొద్దిరోజులుగా అసహనంతో దుర్భాషలకు దిగుతున్నారు. ఆయన పాదయాత్ర పరిహాసాస్పదంగా మారింది. మరోవైపు నియోజకవర్గం పరిధిలో సామాన్య కార్యకర్తల నుంచి సీనియర్ నేతల దాకా ఒక్కొక్కరు ఆయన్ను వీడిపోతున్నారు. విచిత్రమేమంటే వారందరూ మరో పార్టీ వైపు వెళ్లకుండా టీఆర్ఎస్ వైపే వెళ్తుండటం ఈటలకు ఎంతమాత్రం మింగుడుపడటంలేదు. ఇప్పటివరకు హుజూరాబాద్లో బీజేపీ, కాంగ్రెస్లను వీడినవారంతా గులాబీ కండువానే కప్పుకొన్నారు. ఇంతకాలం టీఆర్ఎస్ గొడుగునీడన ఎదిగి.. అదంతా తన బలమేననుకొన్న ఈటలకు వాస్తవం ఏమిటో ఇప్పుడు బోధపడుతున్నదని స్థానిక నేతలు అంటున్నారు. దీంతో ఎలాగైనా ఓట్లు సంపాదించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. కండువా కప్పుకుంటే వెయ్యి రూపాయలు ఇస్తున్నారు.. మండలానికి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చుచేస్తున్నారు. బీరును పొంగిస్తున్నారు.. బిర్యానీ వండిస్తున్నారు. చివరకు వండినదాన్ని తినేందుకు సరిపడా జనం లేక పారేసుకొంటున్నారు. ఎంతచేస్తున్నా స్పందన లేకపోవడంతో మానకొండూరు, కరీంనగర్ ప్రాంతాలనుంచి కిరాయికి తెచ్చుకొని పాదయాత్రను నిర్వహిస్తున్నారు.
ఈటల చెప్పే నీతి మాటలకు.. ఆయనచేసే పనులకు పొంతన లేదు. ఈ విషయం ప్రస్తుతం అడుగడుగునా ప్రస్ఫుటం అవుతున్నది. ప్రస్తుతం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గంలో ఆయన వర్గం పంపిణీ చేస్తున్న తాయిలాలు నిజస్వరూపాన్ని బట్టబయలుచేస్తున్నాయి. బీజేపీ గుర్తు ఒకవైపు.. మరోవైపు రాజేందర్ ఫొటోతో ఉన్న గోడ గడియారాలను ఇంటింటికీ పంపిణీచేస్తున్నారు. అందుకోసం యువకులను వినియోగిస్తున్నారు. ఎవరైనా అడ్డుకుంటే గొడవలకు ఉసిగొల్పుతున్నారు. ప్రశాంతమైన హుజూరాబాద్లో గొడవలు సృష్టించే ప్రయత్నంచేస్తున్నారు. హుజూరాబాద్లోని మామిండ్లవాడలో రాజేందర్ సతీమణి ప్రచారానికి వెళ్తే ఆమె ముందే.. ఓ బాధితుడు.. తాయిలంగా ఇచ్చిన గడియారాన్ని పగులగొట్టిన విషయం తెలిసిందే. అన్ని చోట్లా ఇదే పరిస్థితి. జమ్మికుంట, కమలాపూర్, వీణవంక మండల్లాలోని పలు గ్రామాల్లోనూ ఈటల అనుచరులకు ఎదురైంది. ఇదేకాదు, గుట్టు చప్పుడు కాకుండా మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తూ.. వారితో తమకే ఓటు వేయాలని ఒట్టు వేయించుకొంటున్నట్టు కూడా తెలుస్తున్నది. ఇవే కాదు పాదయాత్ర పొడవునా డబ్బుల పంపిణీ యథేచ్చగా సాగుతున్నది. ఇదంతా కప్పి పుచ్చుకోవడానికి టీఆర్ఎస్పై అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ నుంచి నంబర్ లేని వాహనాలను తెప్పించి.. వాటిల్లో మందు బాటిళ్లను పంపిణీ చేస్తున్నట్టు సమాచారం. ఈ మధ్య హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో నంబర్లేని నాలుగు చక్రాల వాహనాలు పెద్ద మొత్తంలో తిరగడం దీనికి ప్రత్యక్ష నిదర్శనం.