సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): వర్షాకాలంలోనూ విద్యుత్ ప్రమాదాలు పొంచి ఉంటాయి. ముందుస్తు అప్రమత్తతో అలాంటి వాటిని దూరం చేసుకునే అవకాశం ఉందని విద్యుత్ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బయట విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద తరచూ విద్యుత్ షాక్తో ప్రజలు ప్రమాదాల బారిన పడుతుంటారు. కొన్ని చోట్ల విద్యుత్ షాక్తో ప్రాణాలు పోతున్న సంఘటన చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగర వాసులు ఇంటా, బయటా విద్యుత్ షాక్తో అప్రతమత్తంగా ఉండాల్సి అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఇంటి నిర్మాణంలో ఎలక్ట్రికల్ వర్క్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇంటిని వెలుతురుతో ధగధగలాడించడంతో పాటు ప్రతి అవసరంలోనూ విద్యుత్ వినియోగం చాలా ముఖ్యం.
ఇందులో ఏమాత్రం ఆశ్రద్ద చూపినా జరిగే నష్టం ఊహించనంతగా ఉంటుంది. విద్యుత్ సరఫరా వ్యవస్థ కోసం ఉపయోగించే పైపులు, తీగల నాణ్యత, నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగునంగా ఉందా లేదా అన్నది చాలా ముఖ్యం.విద్యుత్ పనులు చేయించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నిపుణులైన ఎలక్ట్రిషియన్లను ఎంపిక చేసుకునే పనులు చేయించుకుంటే ప్రమాదాలను నివారిస్తుందని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇంటి వద్ద ఉండే కరెంటు స్థంభం వరకు విద్యుత్ లైను తీసుకువచ్చే బాధ్యత విద్యుత్ శాఖదైతే.
స్థంభం నుంచి ఇంట్లో మీటరకు వరకు, అక్కడి నుంచి ఇంట్లోని ప్రతి గదికి తీసుకువెళ్లే విద్యుత్ సరఫరాలో వాడే పైపులు, తీగల నాణ్యత మీద,వాటిని బిగించే విధానంపై పూర్తి బాధ్యత ఆయా ఇంటియజమానులే తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంట్లో ఉపయోగించే వివిధ ఎలక్ట్రిక్ పాయింట్ల మొత్తం లోడ్ను లెక్కించారో లేదో నిర్ధారించుకోవాలి. అదేవిధంగా వైరింగ్ కూడా ఇంట్లోని పలు ప్రదేశాల్లో ఉన్న ఎలక్ట్రిక్ పాయింట్ల నుంచి లోడ్ తీసుకుంటుందో లేదో చూసుకోవాలి. లోడ్ను ఏమాత్రం తట్టుకోలేని, సరైన నాణ్యత లేని వైర్లను ఉపయోగించినట్లయితే ఇది ఇంట్లో అగ్రి ప్రమాదాలకు దారి తీసి ప్రాణాలకు అపాయం కలిగించే ప్రమాదం ఉంది.
ఇళ్లలో విద్యుత్ వినియోగం అత్యంత కీలకమైంది. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు, ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటోంది. దీనికి వర్షాకాలంలో ప్రత్యేకంగా విద్యుత్ షాక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో వినియోగాన్ని తట్టుకునేలా ఆయా ఇళ్లలో ఏర్పాట్లు చేశారా లేదా అన్ని విషయాన్ని నిపుణులైన ఎలక్ట్రిషియన్లతో ఒకసారి తనిఖీ చేయించుకోవాలి. వారి సూచనల మేరకు ఇంట్లో విద్యుత్తో నడిచే ఉపకరణాలను వాడాలి. అవగాహన లేకుండా సొంతంగా మరమత్తులు చేసుకోరాదు. ఎలక్ట్రిక్ ఉపకరణాలు ఏయే పాయింట్లలో వాడలా, అక్కడ దానికి అనుగుణంగా కేబుల్ వైరు సామర్థ్యం ఉందో లేదో చూసుకున్న తర్వాత వాడాలి. లేదంటే స్విచ్చ్ బోర్డుపై ప్రభావం చూపి, అవి కాలిపోయి షాక్ కొట్టే ప్రమాదం ఉంది. నక్కా యాదగిరి, తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు సభ్యులు.