సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): చెరువుల పరిరక్షణను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో ఉన్న చెరువుల సరిహద్దులు (పుల్ ట్యాంక్ లెవల్-ఎఫ్టీఎల్), చెరువు పరిధిలో ఉండే భూముల సర్వే నంబర్ల గుర్తించే బాధ్యతలను సంస్థ పరిధిలోని లేక్ ప్రొటెక్షన్ కమిటీ చూస్తున్నది. దీంతో హెచ్ఎండీఏ గుర్తించిన చెరువుల ఫైనల్ నోటిఫికేషన్ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. లేక్ ప్రొటెక్షన్ కమిటీతో నీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖలకు పూర్తిస్థాయిలో సమన్వయం లేకుండా పోయింది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభు త్వం ఫైనల్ నోటిఫికేషన్ పూర్తికాకుండా మిగిలి ఉన్న చెరువుల ఎఫ్టీఎల్, సర్వేనంబర్ల గుర్తించే బాధ్యతలను ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లకు అప్పగిస్తూ జీవో ఎం.ఎస్. నెం.74ను జారీచేసింది. దీనికి అనుగుణంగా హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ విభాగం అధికారులు హెచ్ఎండీఏ పరిధిలోని 7 జిల్లాల అదనపు కలెక్టర్లకు గుర్తించిన చెరువుల వివరాలను అందజేశారు. దీనికి సంబంధించిన వారం రోజులుగా ఆయా జిల్లాల్లో హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ అధికారులు పర్యటించి చెరువుల పరిరక్షణపై చర్చిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా మినహాయిస్తే గ్రేటర్ చుట్టూ రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, భువనగిరి యాదాద్రి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల పరిధిలో ఉన్న చెరువులు అన్యాక్రాంతం అవుతున్నాయి.
జలవనరులను ధ్వంసం చేస్తున్నరియల్ ఎస్టేట్ వ్యాపారులు..
గ్రేటర్ చుట్టూ హెచ్ఎండీఏ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా కొనసాగుతున్నది. మాస్టర్ ప్లాన్లో గుర్తించిన జలవనరులైన చెరువు, కుంటలు, వరద నీటి కాల్వలను కబ్జా చేసి లేఅవుట్లు చేసి విక్రయిస్తున్నారు. దీంతో వరద నీటి పారుదల అస్తవ్యస్తంగా మారడమే కాకుండా చెరువుల్లోకి నీరు వెళ్లడం లేదు. నీటి వనరులు కనుమరుగై, నీటి ఎద్దడి తలెత్తుతున్నది. దీన్ని అడ్డుకునేందుకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోని లేక్ ప్రొటెక్షన్ కమిటీ కొన్నేండ్లుగా చెరువుల పరిరక్షణపై కసరత్తు చేస్తున్నది. అయితే వారికి జిల్లా కల్టెకరేట్ పరిధిలోని నీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖల నుంచి సరైన సహకారం లేకపోవడంతో చెరువుల పరిరక్షణ ఏండ్ల తరబడిగా పెండింగ్లోనే ఉంది. జలవనరులకు అధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం, వాటి పరిరక్షణ కోసం ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లకు బాధ్యతలను అప్పగించేలా నిబంధనలు రూపొందించి జీవో జారీచేసింది. అదనపు కలెక్టర్ల నేతృత్వంలో నీటి పారుదలశాఖ, రెవెన్యూ అధికారులు కలిసి చెరువులను పరిశీలించి, వాటి ఎఫ్టీఎల్, సర్వే నంబర్లను గుర్తించి రూపొందించిన నివేదికను హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్కు పంపిస్తే, వారు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటారు.