హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో విద్యాభ్యాసంపై విద్యార్థుల్లో కొత్త ట్రెండ్ కనిపిస్తున్నది. గతంలో మాస్టర్స్, పీజీ ప్రోగ్రాములకు ఫారిన్ వెళ్లగా.. ఇప్పుడు ఇంటర్ (ప్లస్ టూ) తర్వాతే విదేశీ విమానం ఎక్కేస్తున్నారు. డిగ్రీ, పీజీసహా పీహెచ్డీ కోర్సులను సైతం అక్కడే పూర్తిచేయాలని భావిస్తున్నారు. ప్రతిసీజన్కు 20 వేల మంది విద్యార్థులు విదేశీ చదువుల బాట పడుతున్నారు. అందరి అడుగులు కూడా అమెరికా వైపే పడుతున్నాయి. గతంలో పోలిస్తే విదేశాల్లో విద్యావిధానం గురించి విద్యార్థుల్లో అవగాహన పెరుగడం, ప్రభుత్వం సైతం ఓవర్సీస్ స్కాలర్షిప్స్ను అందజేస్తుండటం, ఎడ్యుకేషన్ లోన్లు సులభంగా ఇవ్వడం వల్ల ఫారిన్ చదువుల పట్ల ఆసక్తి పెరిగింది. అమెరికాలో 4,700లకుపైగా యూనివర్సిటీలు ఉండటం, ఇవి పేరొందిన ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులు అందిస్తుండటంతో భారతీయులు ఎక్కువగా అక్కడికే వెళ్తున్నారు. యూఎస్లో చవివే విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే. 18 శాతం విద్యార్థులతో భారత్ రెండోస్థానంలో ఉన్నది.