భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 29(నమస్తేతెలంగాణ): రాజకీయ ఉనికి కోసమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్ర చేపట్టారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ యాత్ర ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎంపీగా ఉన్న సంజయ్ తన యాత్రను ఢిల్లీకి చేయాలన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకున్న నిర్ణయాలు రైతుల నడ్డి విరిచేలా ఉన్నాయని, సాగు, విద్యుత్తు సంస్కరణ చట్టాలతో రైతులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. హరియానాలో నిరసన తెలుపుతున్న రైతుల తలలు పగులగొట్టిన ఘన చరిత్ర గల బీజేపీకి దేశాన్ని పాలించే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకే పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.