బంజారాహిల్స్,ఏప్రిల్ 27: ఇద్దరు ప్రేమించుకుని.. 14 ఏండ్ల క్రితం పెండ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు.. ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్నాడు. రోజూ చిత్రహింసలకు గురిచేయడంతోపాటు కొట్టడం ప్రారంభించాడు. ఇతడికి సోదరుడు, కుటుంబ సభ్యులు మద్దతు పలికారు.. భర్త వేధింపులు భరించలేక.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.. ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..
మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం, నెల్లికొండ గ్రామానికి చెందిన విజయ(31) అడ్డాకుల మండలానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తిని 14 ఏండ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వారిద్దరూ ఎస్పీఆర్హిల్స్ సమీపంలోని రాజీవ్గాంధీనగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. ఆంజనేయులు ఇసుక లారీ డ్రైవర్గా, విజయ హౌస్కీపింగ్ పనికి వెళ్తున్నది. కాగా… అనుమానంతో కొన్ని నెలలుగా విజయను వేధిస్తున్నాడు. రోజూ కొట్టడంతోపాటు చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. అతడితోపాటు సోదరుడు చంద్రన్న, కుటుంబసభ్యులు విజయను వేధించసాగారు.. ఈ క్రమంలో సోమవారం రాత్రి మరోసారి ఆంజనేయులు.. విజయను తీవ్రంగా కొట్టాడు.. తీవ్ర మనస్తాపం చెందిన విజయ సూసైడ్నోటు రాసి తన గదిలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు..
తన చావుకు భర్త ఆంజనేయులే కారణమని, అతడు పెట్టే చిత్రహింహసలు భరించలేకపోతున్నానని, గతంలో కూడా తనను చంపేందుకు ప్రయత్నించాడని, అతడి సోదరుడు చంద్రన్న, కుటుంబసభ్యుల మద్దతుతోనే ఇలా చేస్తున్నాడని అందులో రాసింది. తాను చనిపోయిన తర్వాత తన పిల్లలు భర్త వద్ద ఉండవద్దని, వారు తన తల్లి, సోదరుల వద్దకు వెళ్లాలని కోరింది. ఈ మేరకు పోలీసులు నిందితుడు ఆంజనేయులుపై ఐపీసీ 498(ఏ), 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.