వినాయక్నగర్, ఫిబ్రవరి 13: యువతే దేశ భవిష్యత్తు అని, అలాంటి యువత రోడ్డు ప్రమాదాల బారినపడి ఉజ్వల భవిష్యత్తును కోల్పోకూడదని నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. 35వ రోడ్డు భద్రతా మాసోత్సవాలు, మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ ఆధ్వర్యంలో ఓరల్ అండ్ మ్యాక్సీల్లో ఫేషియల్ సర్జన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ దవాఖాన వద్ద జడ్జి సునీత కుంచాల, సీపీ కల్మేశ్వర్ సింగెనవర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, యువత సమాజానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు.
చట్టాలను గౌరవించి వాటిని పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. సీపీ కల్మేశ్వర్ సింగెనవర్ మాట్లాడుతూ నిబంధనలు పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల్లో సుమారు 320 మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. డెంటల్ కాలేజీ విద్యార్థులకు రీజినల్ ట్రాన్స్పోర్టు శాఖ ద్వారా స్పెషల్డ్రైవ్ నిర్వహించి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సాయిచంద్, అదనపు డీసీపీ జయరాం, ప్రొబెషనరీ ఐపీఎస్ బి.చైతన్యా రెడ్డి, ఏసీపీలు నారాయణ, కిరణ్కుమార్,అరుణ్ కుమార్, ట్రాఫిక్ సీఐ వెంకట్ నారాయణ, ఆర్ఐ సతీశ్, డాక్టర్లు కల్యాణచక్రవర్తి, అమర్నాథ్, ప్రవీణ్ కుమార్, శోభారాణి, సాయిచంద్ పాల్గొన్నారు.