బెల్లంపల్లిటౌన్, ఏప్రిల్ 10 : అతి సామాన్య కుటుంబం నుంచి భారత వాయుసేనలోని టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించి రికార్డు నెలకొల్పింది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బాబుక్యాంపు బస్తీకి చెందిన చాముండేశ్వరి. తెలంగాణలో ఉన్న ఏకైక సాంఘిక సంక్షేమ సాయుధ దళాల కళాశాల నుంచి తొలిసారి ఆమె ఉద్యోగం పొందింది. బస్తీకి చెందిన గోపు విజయ్, శారద దంపతులకు కొడుకు చాముండేశ్వరి, కొడుకు కపిల్కుమార్ ఉన్నారు. విజయ్ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ మోటర్ షోరూంలో గుమస్తాగా పని చేస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. చాముండేశ్వరి చిన్నతనం నుంచే చదువులో రాణిస్తున్నది. మిలిటరీ తరహా ఉద్యోగం సాధించాలని తండ్రి తరచుగా ప్రోత్సహించేవాడు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు బెల్లంపల్లి శివాని కాన్వెంట్, ఎనిమిది నుంచి పది వరకు సెయింట్ మేరీస్ పాఠశాలలో చదివింది. పదో తరగతిలో 9.2 గ్రేడ్ సాధించింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివి 965 మార్కులతో ఉత్తీర్ణురాలైంది. అనంతరం మంచిర్యాల సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో 2018-19లో సీటు సాధించింది. అదే విద్యాసంవత్సరంలో భువనగరి సాంఘిక సంక్షేమ మహిళా సాయుధ దళాల శిక్షణ కళాశాలలో చేరింది. గతేడాది డిసెంబర్లో ఎయిర్ ఫోర్స్ క్యాట్ పరీక్ష రాసి ఎంపికైంది. ఈ నెల 5 నుంచి 9 వరకు నిర్వహించిన అన్ని పరీక్షల్లో విజయం సాధించింది. మైసూర్ ఎస్ఎస్బీ తరపున వాయుసేనలోని టెక్నికల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహించనున్నది. చాముండేశ్వరి ఉద్యోగం పొందడం పట్ల గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ట్విట్టర్లో అభినందించారు.