ఆత్మకూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతోంది. అల్పపీడన ప్రభావంతో ఎగువన కురుస్తున్న వర్షాలకు సోమవారం ఉదయం నుంచి క్రమంగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో తెల్లవారుజాము 2గేట్లు ఎత్తగా ఉదయా న్నే7గేట్లు ఎత్తారు. 9 గంటల వరకు 8 గేట్లెత్తి మధ్యాహ్నం వరకు కొనసాగగా మధ్యాహ్నం 3 గంటల తరువాత గేట్లను తగ్గించారు. సాయంత్రానికి 5 గేట్లెత్తి స్పిల్వే ద్వారా 34,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎడమ కాలువకు 945 క్యూసెక్కులు, కుడి కాలువకు 672, సమాంతర కాలువకు 850, భీమా -1కు 650, భీమా-2కు 750, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 32,775 క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తికి విడుదల చేస్తుండగా ఎగువ, దిగువ విద్యుత్కేంద్రాలలో విద్యుదుత్పత్తి నిర్విరామంగా కొనసాగుతున్నది.
ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో 3.955 మి.యూ ఉత్పత్తి జరుగగా ఇప్పటి వరకు మొత్తంగా 213.241 మి.యూ ఉత్పత్తి జరిగింది. దిగువ జూరాల విద్యుత్కేంద్రంలో 4.86 మి.యూ ఉత్పత్తి జరుగగా మొత్తంగా 236.875 మి.యూ విద్యుదుత్పత్తి జరిగింది. ప్రాజక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రం 8.611 టీఎంసీలు నమోదయ్యింది. ప్రాజక్టు నుంచి 92,628 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతుంది.