న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: కొవిషీల్డ్ టీకా ధరను కేంద్రానికి ఒకలా.. రాష్ర్టాలకు మరొకలా నిర్ణయించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల తీరు ఏ మాత్రం మారలేదు. భారత్ బయోటెక్ కూడా సీరమ్ ఇన్స్టిట్యూట్ బాటలోనే నడిచింది. రాష్ర్టాలకు ఒక రేటు, కేంద్రానికి మరో రేటు నిర్ణయిస్తూ తమ కొవాగ్జిన్ టీకా ధరలు భారీగా పెంచింది. కొవాగ్జిన్ టీకా ధరలను పెంచుతున్నట్టు భారత్ బయోటెక్ శనివారం ప్రకటించింది. కేంద్రప్రభుత్వానికికైతే రూ.150లకు, రాష్ట్ర ప్రభుత్వాలకైతే రూ.600లకు, ప్రైవేటు దవాఖానలకైతే రూ.1200లకు టీకా విక్రయిస్తామని తెలిపింది. టీకాను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామని ప్రకటనలో పేర్కొన్నది. ఎగుమతి చేసే టీకా ధర 15-20 డాలర్ల (రూ.1,100-రూ. 1,500) మధ్య ఉంటుందని తెలిపింది. తాము ఉత్పత్తి చేసే మొత్తం టీకాల్లో సగం కంటే ఎక్కువ కేంద్రప్రభుత్వానికి రిజర్వ్ చేస్తామని, వాటిని ప్రస్తుతం ఉన్నట్టుగా రూ.150కే అందజేస్తామని స్పష్టం చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ వనరులతో కంపెనీని నడిపిస్తున్నప్పటికీ రాష్ట్రప్రభుత్వానికి కేంద్రంకంటే ఎక్కువ ధరకు అందించటం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంతటి సంక్షోభ సమయంలో ప్రజలపై భారం పెరిగేలా ప్రైవేటు దవాఖానల్లో రూ.1200కు విక్రయించటం ఏమిటని పలువురు నిలదీస్తున్నారు. ఈ సమయంలో ప్రజలందరికీ టీకా అందించాల్సిన కేంద్రం బాధ్యతను మరిచి ఫార్మాసంస్థలు లాభాలు గడించుకోవడానికి వెసులుబాటు కల్పించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టీకాలను ఎగుమతి చేసి ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం’గా భారత్ పరిస్థితి ఉందని, మళ్లీ ఎగుమతులకు అవకాశం ఇస్తే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ కూడా కొవిషీల్డ్ ధరలు పెంచిన సంగతి తెలిసిందే. కేంద్రం ఈ నెల19న టీకాలను ప్రైవేటు దవాఖానలకు, రాష్ర్టాలకు సొంతంగా అమ్ముకోవడానికి వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు వెసులుబాటు కల్పించింది. దీనిని అనేక రాష్ర్టాల సీఎంలు ఖండించారు.