అమ్మ ఒడి.సర్కారు బడి.ఆయన నేపథ్యం ఇంతే!చిన్నతనంలో తండ్రిని కోల్పోయినా తల్లి మాటలే స్ఫూర్తిగా చదువులో రాణించారు.నూనూగు మీసాల నూత్న యౌవనంలో ప్రభుత్వోద్యోగం వచ్చినా, అక్కడితో ఆగిపోలేదు. రేయింబవళ్లు చదివారు. పట్టాలమీద పట్టాలు పుచ్చుకున్నారు. సివిల్స్లో జాతీయస్థాయిలో 61వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అయ్యారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ కార్యదర్శి స్థాయిలో స్పెషల్ సెక్రటరీగా సేవలందిస్తున్న నల్గొండ బిడ్డ కొలనుపాక రాజేశ్వర్రావు విజయ ప్రస్థానం ఆయన మాటల్లోనే..
అమ్మ చెప్పిన మాట, అమ్మ చూపిన బాట నా జీవితం. అమ్మ మాకు ఉపదేశించిన మంత్రం చదువు. అదొక్కటే జీవితాన్ని తీర్చిదిద్దుతుందని ఎప్పుడూ అంటుండేవారు. మా ఇంట్లో అందరి విజయాలకూ స్ఫూర్తి అమ్మ ఇచ్చిన ప్రోత్సాహమే. నేను నల్గొండలో పుట్టాను. నాన్న వెంకటకిషన్ రావు. అమ్మ రుక్మిణి. నాకు ముగ్గురు అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. పెద్ద కుటుంబం మాది. నాన్న ఆ రోజుల్లోనే డిగ్రీ చేశారు. ఆయనకు చదువంటే ఇష్టం. అందుకే, రెవెన్యూ శాఖలో ఉద్యోగం వచ్చినా కాదనుకొని ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు. 1974లో నాన్న గుండెపోటుతో మరణించారు. గంపెడు సంసారం అమ్మ ఒక్కతే ఎలా నెట్టుకొస్తుందో అని అనుకున్నారంతా! అమ్మ మాత్రం వెరవలేదు. మొక్కవోని ధైర్యంతో కుటుంబాన్ని పోషించింది. మమ్మల్ని తీర్చిదిద్దింది. అమ్మ ప్రోత్సాహంతోనే నేనీ స్థాయికి రాగలిగాను.
డిగ్రీలోనే ఉద్యోగం
నల్గొండలోని రామగిరి యూపీఎస్లో నా విద్యాభ్యాసం సాగింది. బాయ్స్ హైస్కూల్లో పదో తరగతి వరకు చదివాను. చదువుల్లో ఎప్పుడూ టాప్గా నిలిచేవాణ్ని. పదిలో మంచి మార్కులు రావడంతో మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. ఇంటర్ బాయ్స్ జూనియర్ కాలేజీలో చేరా. తర్వాత నల్గొండ జిల్లా ఎన్జీ కాలేజీలో బీఎస్సీలో చేరా. అప్పటికే టైప్ రైటింగ్ నేర్చుకున్నా. లోయర్ గ్రేడ్ పరీక్షకూడా పాసయ్యా. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగానే హైదరాబాద్ బర్కత్పురలోని పీఎఫ్ ఆఫీస్లో ఎల్డీసీగా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే చదువుకోవచ్చనే ఉద్దేశంతో, 1980 సెప్టెంబర్లో హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యా. నా మొదటి జీతం రూ.540. ఉదయం ఉద్యోగం చేస్తూ అగర్వాల్ ఈవినింగ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ కంటిన్యూ చేశా. అప్పట్లో మన దగ్గర ఇదొక్కటే ఈవినింగ్ సైన్స్ కాలేజీ. ఆఫీస్నుంచి నేరుగా కాలేజీకి వెళ్లేవాణ్ని. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు క్లాసులు. రూమ్కు చేరుకునేసరికి రాత్రి 11 దాటిపోయేది. చదువు, ఉద్యోగ పనులతో రాత్రి సరిగ్గా నిద్రపోయేవాణ్ని కాదు. ఎలాగో కష్టపడి డిగ్రీ ఫస్ట్క్లాస్లో పాసయ్యాను.
పీజీలో తెలుగు లిటరేచర్
ప్రభుత్వోద్యోగం వచ్చిందని అక్కడితో ప్రయాణం ఆపాలనుకోలేదు. డిపార్ట్మెంటల్ పరీక్షలు రాసి యూడీసీగా ప్రమోషన్ పొందాను. చిన్నప్పటినుంచీ కూడా లిటరేచర్పై ఆసక్తి ఉండేది. అందుకే, నిజాం కాలేజీలో ఎంఏ తెలుగు లిటరేచర్ చేశాను. మా కాలేజీ మ్యాగజైన్లకు ఆర్టికల్స్ రాసేవాణ్ని. ఆల్ ఇండియా ఫ్రాంక్ మెమోరియల్ అవార్డు వచ్చింది. మరోవైపు, సాయంత్రం జర్నలిజంలో పీజీ చేశాను. నిజాం కాలేజీలో నా సహ విద్యార్థి శశిధర్రెడ్డి నన్ను సివిల్ సర్వీసెస్ రాయమని ప్రోత్సహించాడు. అప్పటి వరకు నాకు సివిల్స్ గురించి పెద్దగా అవగాహన లేదు. అప్పుడు ఇంత సమాచార వ్యవస్థ లేదు. చెప్పిన వారు కూడా పెద్దగా లేరు. పోరాడితే పోయేదేం లేదని సివిల్స్వైపు అడుగులు వేశాను.
మూడోసారి 61వ ర్యాంక్
1985లో సమాచార పౌర సంబంధాల శాఖలో పీఆర్ఓ పోస్టుకు ఎంపికయ్యాను. యూడీసీ నుంచి డివిజనల్ పీఆర్వోగా జాయిన్ అయ్యాను. 1986లో తెలుగు లిటరేచర్ ఐచ్ఛికంగా సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశాను. సందేహాలు తీర్చుకోవడానికి కామారెడ్డిలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఏఆర్ వాచస్పతి దగ్గరికి వెళ్లాను. ఆయన ఓరియెంటల్ కాలేజీలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తరగతులు చెప్పేవారు. ఆ తర్వాత, రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు నాకు పాఠాలు చెప్పేవారు. మొదటిసారి ప్రిలిమ్స్ దాటలేకపోయా. 1987లో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా జాబ్ వచ్చేంత ర్యాంక్ సాధించలేకపోయా. నాలో లోపం ఎక్కుడుందో 15 రోజులపాటు నన్ను నేను విశ్లేషించుకున్నా. ఎలాగైనా ఐఏఎస్ సాధించాలనే లక్ష్యంతో మూడోసారి సివిల్స్కు ప్రిపేరయ్యా. రోజూ 16 గంటలు చదివేవాణ్ని. జాతీయ స్థాయిలో 61వ ర్యాంక్ సాధించాను. త్రిపుర కేడర్కు ఎంపికయ్యాను.ఐఏఎస్ సాధించిన తర్వాత కూడా నా చదువు ఆపలేదు. సోషల్ సైన్సెస్లో పీహెచ్డీ చేశాను. డాక్టరేట్ పట్టాను పొందాను. నేషనల్ సెక్యూరిటీలో ఎంఫిల్ చేశాను. సోషియాలజీలో పీజీ చేశాను.
ముగ్గురు ఐఏఎస్లు
మా ఇంట్లో అందరం పీజీ చేశాం. మా పెద్దక్క రిటైర్డ్ లెక్చరర్. రెండో అక్క జ్యుడీషియల్ సర్వీస్. మూడో అక్క కేంద్ర ప్రభుత్వ సర్వీసులో అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. అన్న ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పనిచేశారు. తమ్ముడు ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్. చెల్లెలు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. మా పెద్దక్క కొడుకులు ఇద్దరు మా అమ్మ దగ్గరే ఉండి చదువుకున్నారు. నా స్ఫూర్తితో వారిద్దరూ ఐఏఎస్కు ఎంపికయ్యారు. వారిలో, కృష్ణ చైతన్య ములుగు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు. కృష్ణ ఆదిత్య మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి.
తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణులు దివంగత ఆర్.విద్యాసాగర్ రావు కూతురు అపర్ణతో నా పెండ్లి జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు. కొడుకు కుందన్ కృష్ణ కేంద్ర ఆర్థికశాఖలో గ్రేడ్ వన్ అధికారిగా పనిచేస్తున్నారు. కూతురు శ్రావ్య టాటా సంస్థ స్టార్టప్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. ఇలా మా కుటుంబ సభ్యులంతా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మేమేమైనా సాధించామంటే అందుకు పూర్తి క్రెడిట్ మా అమ్మ రుక్మిణికే ఇవ్వాలి. ‘చదువే బతుకు. చదువే బతుకుదెరువు’ అని చెప్పి మాకు సరైన దిశను నిర్దేశించింది అమ్మ.
కమిట్మెంట్తో చెప్పేవారు
మా చిన్నప్పుడు పాఠశాలలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండేవి. కానీ, ఉపాధ్యాయులు మాత్రం చాలా మంచివారు. కమిట్మెంట్తో ఉండేవారు. మా తెలుగు మాస్టారు ఏ.రామచంద్రారెడ్డి సారు చెబుతుంటే ఎంతసేపు అయినా వినాలనిపించేది. సులభంగా అర్థమయ్యేది. ఆయనలాంటి వారివల్లే నాకు తెలుగుపై ఆసక్తి పెరిగింది. అప్పట్లో ఇంటర్నెట్, టీవీ, న్యూస్ పేపర్లు పెద్దగా లేవు. విద్యార్థులకు ప్రపంచం గురించి తెలియాలనే ఉద్దేశంతో ప్రార్థన సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ ముఖ్యాంశాలు చదివించే వారు. దీనిద్వారా సామాజిక స్పృహ కలిగేది. అయితే, ఎప్పుడూ చదువులమీదే దృష్టి పెట్టడంతో ఆటల జోలికి వెళ్లలేదు. ఇప్పుడు ఆలోచిస్తే కొంత అసంతృప్తి అనిపిస్తుంటుంది. యూనివర్సిటీ క్యాంపస్లో చదువకపోవడం కూడా లోటుగా అనిపిస్తుంది.
ఎ న్నోజ్ఞాపకాలు
మాచార పౌర సంబంధాల శాఖలో డివిజనల్ పీఆర్వోగా పనిచేసినప్పుడు జోగినుల సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కార్యక్రమాలు చేపట్టాం. వివిధ పత్రికల్లో వందలకొద్దీ ఆర్టికల్స్ రాశాను. మొదటిసారి పేరుతో ఆర్టికల్ ప్రింట్ అయినప్పుడు అయితే, ఐఏఎస్కు ఎంపికైనంత ఆనందం! త్రిపురలో ఉదయ్పూర్ జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు గిరిజనుల దగ్గరికి వెళ్లడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాణ్ని. దీంతో అప్పటి ప్రణాళికా సంఘం నన్ను అభినందించింది. 200 స్కూల్స్, 100 అంగన్వాడి సెంటర్లను అతి తక్కువ సమయంలో నిర్మించాం. అంతకు ముందు సబ్ కలెక్టర్గా పనిచేసే సమయంలో రాష్ట్రపతి మెడల్ లభించింది. త్రిపుర సీఎంవో కార్యదర్శిగా చేశాను. 1997 నుంచి 2003 వరకు మన దగ్గరే పట్టణాభివృద్ధి శాఖలో అడిషనల్ సెక్రటరీగా పనిచేశాను. కేంద్రంలో పని చేసినప్పుడు గనులశాఖలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో మైనింగ్ పాలసీని రూపొందించడంలో కీలకపాత్ర పోషించాను. ఇవన్నీ నాకు ఎంతో సంతృప్తినిచ్చాయి. నీతి ఆయోగ్ స్పెషల్ సెక్రెటరీగా దేశ అభివృద్ధిలో నా వంతు పాత్రను పోషిస్తున్నాను.
-నెలకుర్తి శ్రీనివాసరెడ్డి