పంటభూముల్లో వెలసిన కుంటల్లో చేపలు చెంగుమంటున్నాయి. కొర్రమీనులు గంతులు వేస్తున్నాయి. చేపల చెరువులు అంటే ఒకప్పుడు అక్కడెక్కడో గోదారి జిల్లాలు అన్నట్టు ఉండేది. ఇప్పుడు మిషన్ కాకతీయ, కాళేశ్వరం తదితర ప్రాజెక్టులతో ఎక్కడ చూస్తే అక్కడ అన్నట్టు చేపలచెరువులు కళకళలాడుతున్నాయి. పొలాల్లో వలలు విసిరి కాసులు గంపకెత్తుతున్నారు. ఒకసారి పెట్టుబడితో దీర్ఘకాలిక రాబడిని ఇస్తున్న మీనాల పెంపకం ఒక కొత్త ట్రెండుగా మారింది. నీలిసేద్యం కాసులు కురిపిస్తున్నది. రైతులు, యువత మత్స్యావతారానికి జైకొడుతున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): సంప్రదాయ పంటలకు పెట్టుబడి, శ్రమ అధికం.. భూమి కూడా ఎక్కువే ఉండాలి. ఎక్కువ పెట్టుబడి పెట్టినా లాభం వస్తుందా! అంటే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పలువురు రైతులు ప్రత్యామ్నాయాలవైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా చేపల పెంపకానికి రాష్ట్రంలో భారీగా డిమాండ్ పెరిగింది. ఒకసారి పెట్టుబడి పెడితే దీర్ఘకాలం లాభాలు సాధించే అవకాశం ఉండటంతో రైతులంతా ఆవైపు చూస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణలో చేపల పెంపకం పెద్దగా లేదు. ఉన్నా.. అది సంప్రదాయ చెరువుల్లో పెంపకమే. కానీ ఇప్పుడు తెల్లచేపలు, నల్లచేపల సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. కొర్రమీను రకానికి మంచి లాభాలు వస్తుండటంతో, ఒకరిని చూసి మరొకరు చేపల పెంపకంలోకి వస్తున్నారు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో చేపల్ని భారీగా పెంచుతున్నారు. చాలామంది తమకున్న భూమిలో 10 గుంటల విస్తీర్ణంతో చెరువులు తీయించి కొర్రమీను చేపల పెంపకాన్ని చేపట్టారు. తక్కువ కాలంలోనే దిగుబడి సాధిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఏటా చేపల వినియోగం పెరుగుతుండటం, ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో ఆర్థికంగా బలపడుతున్నారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు తమకు వరంగా మారాయని, నీటి వనరులకు ఢోకా లేకుండా పోయిందని.. చేపల పెంపకానికి అవసరమైన నీరు ఉండటంతోనే తాము ఈవైపు దృష్టిసారించినట్టు రైతులు పేర్కొంటున్నారు.
చేపల చెరువు నిర్మాణం: పొడవు 40 గజాలు, వెడల్పు 30 గజాలు ఉండాలి. విస్తీర్ణం 8 గుంటలు. ఎత్తు 5 ఫీట్లు, కట్ట ఎత్తు 4 ఫీట్లు.. మొత్తంగా 10 ఫీట్ల లోతు ఉండాలి. మొత్తం నెట్ ఖర్చు రూ.50 వేలు, గ్రీన్ మ్యాట్ ఖర్చు రూ.20 వేలు అవుతుంది.
చేపలకు అందించే దాణా: కొర్రమీను పిల్లలకు మొదటి నెలన్నర వరకు 1 ఎంఎం దాణా, మరో నెలన్నర 2 ఎంఎం దాణా అవసరం. పెరిగేదాన్ని బట్టి దాణా ఇవ్వాలి. కొరమేనుకు అవసరమైన నాచు, పురుగులు పెరిగేందుకు పల్లి చెక, తవుడు, బెల్లం దాణాగా అవసరం.
విదేశాల్లో ఉద్యోగం మానేసి..
డిగ్రీ పూర్తిచేశాక విదేశాల కు వెళ్లి ఉద్యోగం చేశా. కరో నా ప్రభావంతో తిరిగొచ్చి చేపల పెంపకాన్ని ప్రారంభిం చా. 10 గుంటల్లో చేపల చెరువు నిర్మాణానికి లక్షన్నర అయ్యింది. కొర్రమీను పెంపకానికి రూ.6.5 లక్షల పెట్టుబడి పెట్టా. దిగుబడి 3 టన్నుల వ రకు వచ్చే అవకాశం ఉన్నది. మొత్తంగా రూ.9 లక్షల ఆదాయం వస్తుంది.
మేకల సందీప్రెడ్డి, యువరైతు, యల్లగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా
తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ప్రతిఫలం
చేపల పెంపకానికి తక్కువ విస్తీర్ణంలో భూమి అవసరం. శ్రమ తక్కువ, దిగుబడి, లా భం అధికం. 10 గుంటల భూమిలో చేపల చెరువు త వ్వించి 5 వేల కొర్రమీను చేపపిల్లలను పెంచుతున్నా. 9 నెలలకు ఒక పంట తీస్తున్నా. కిలో కొర్రమీను రూ.350-రూ.400 వరకు ధర వస్తుంది. దాణాగా చెరువులో నాచు పెరగడానికి తవుడు, బెల్లం వాడుతున్నాం.
పొనుగోటి కన్నారావు, చల్లగిరి, చౌటుప్పల్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా