హైదరాబాద్, జూలై 13 (నమస్తేతెలంగాణ): ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే ఆహారంగా గుర్తింపు పొందిన చేపల నుంచి పంజాబ్లోని లుధియానా ఫిషరీస్ కాలేజీ పరిశోధకులు ‘ఫిష్ బిస్కెట్లు’ తయారుచేశారు. ఈ బిస్కెట్లు కొవిడ్-19ను ఎదుర్కొనేలా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతున్నాయని కాలేజీ డీన్ మీరా డీ అన్సాల్ తెలిపారు. చేపల్లో ఉండే ఓమెగా, ఫైబర్ కంటెంట్ శరీరానికి ఎంతో ఉపయోగపడుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఫిష్ బిస్కెట్లు తయారుచేసినట్టు అన్సాల్ వెల్లడించారు. ఈ నెల 4న ఈ బిస్కట్లను మార్కెట్లోకి విడుదల చేసినట్టు వెల్లడించారు. కరోనా వేళ ఇలాంటి ప్రొటీన్స్ ఉన్న బిస్కెట్లు తినడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. చేపలతో తయారు చేసినప్పటికీ ఈ బిస్కెట్ల నుంచి చేపల వాసన ఉండదు. చిన్నపిల్లలు వీటిని ఇష్టంగా తింటారని అన్సాల్ తెలిపారు. ఈ బిస్కెట్లు తిన్నవారిలో రోగనిరోధకశక్తి పెరిగినట్టు వెల్లడించారు.