ఎల్బీనగర్, మే 28 : నిత్య సేవకులకు వ్యాక్సినేషన్ తొలిరోజు విజయవంతంగా ముగిసింది. శుక్రవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సరూర్నగర్, హయత్నగర్, ఎల్బీనగర్ సర్కిళ్ల పరిధిలోని టోకెన్లు పొందిన నిత్య సేవకులు కేంద్రాలకు తరలివచ్చి వ్యాక్సిన్ వేసుకున్నారు. హయత్నగర్ సర్కిల్ పరిధిలోని నాగోలు శుభం కన్వెన్షన్లో డివిజన్లోని 631 మంది నిత్య సేవకులు వ్యాక్సిన్ను వేయించుకున్నారు. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని వనస్థలిపురం హూడా కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో వనస్థలిపురం డివిజన్కు చెందిన 788 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. సరూర్నగర్ సర్కిల్ పరిధి చైతన్యపురి వికాస్నగర్లోని గణేశ్ ఫంక్షన్ హాల్లో సరూర్నగర్ సర్కిల్కు చెందిన 847 మంది నిత్య సేవకులు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. మూడు సర్కిళ్ల పరిధిలో మొత్తం 3వేల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యం కాగా తొలిరోజు 2266 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. కాగా నేటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాక్సిన్ వేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
సరూర్నగర్ సర్కిల్ పరిధిలోని గణేశ్ంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. వ్యాక్సిన్ వేసేందుకు చేసిన ఏర్పాట్లను సరూర్నగర్ సర్కిల్ ఉప కమిషనర్ హరి కృష్ణయ్య ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సరూర్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జర్నలిస్టులకు ఏర్పాటుచేసిన కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించి వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పారుపల్లి దయాకర్రెడ్డి, బేర బాలకిషన్, ఆకుల అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఎల్బీనగర్ మూడు సర్కిళ్ల పరిధిలోని నిత్య సేవకుల వ్యాక్సిన్ కేంద్రాలను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ హరి కృష్ణయ్యతో పాటుగా అధికారులు పాల్గొన్నారు
హయత్నగర్: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో, వనస్థలిపురం హుడా కమిటీ హాలులో శుక్రవారం జర్నలిస్టులకు మొదటి డోసు టీకాలు వేశారు. జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే. వనస్థలిపురం ప్రభుత్వ దవాఖానలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి జర్నలిస్టులకు కొవిడ్ టీకాలు వేశారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి జర్నలిస్టులు ఆధార్, అక్రిడిటేషన్ కార్డును చూపించారు. శుక్రవారం మొదటి రోజు కావడంతో రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల జర్నలిస్టులతోపాటు ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్కు చెందిన జర్నలిస్టులు టీకాను వేయించుకున్నారు. జర్నలిస్టుల ఆరోగ్య సంక్షేమం కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాట్లు చేయడం పట్ల పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతిఒక్కరికీ కరోనా టీకాలు వేస్తున్నాం. శుక్రవారం జర్నలిస్టులకు కూడా టీకాలు వేయాలని ఆదేశాలు రావడంతో దాదాపు 150 మందికి టీకాలు పంపిణీ చేశాం. టీకా కోసం వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాం.
మన్సూరాబాద్, మే 28: సూపర్ స్ప్రెడర్ల కోసం పది రోజుల పాటు నిర్వహించనున్న వ్యాక్సినేషన్ను సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ కోరారు. సూపర్ స్ప్రెడర్ల కోసం నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ చింతల అరుణతో కలిసి ఆయన ప్రారంభించారు. కేంద్రంలో కల్పించిన సౌకర్యాలపై కమిషనర్ హర్షం వ్యక్తం చేశారు. టీకా కేంద్రానికి వచ్చే సూపర్ స్ప్రెడర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టీకా కోసం వచ్చిన ప్రజల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. సూపర్ స్ప్రెడర్ల జాబితాలో ఉన్నవారు తమకు కేటాయించిన సమయంలో సదరు సెంటర్కు వచ్చి టీకా వేసుకోవాలని సూచించారు. జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి, వివిధ సర్కిళ్ల డీసీలు మారుతి దివాకర్, సురేందర్రెడ్డి, కృష్ణయ్య, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, ఈఈ రాజయ్య, డీపీవో రంగారావు, ఏఎంహెచ్ఓ మంజులవాణి, డీఈ పున్నానాయక్, ఎల్బీనగర్ సీఐ అశోక్రెడ్డి, ఏఈ చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.