సజావుగా పాలిసెట్.. 90% మంది హాజరు
హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వ్యాప్తి భయాలు, ఆందోళనల మధ్య రాష్ట్రంలో నిర్వహించిన తొలి ప్రవేశపరీక్ష పాలిసెట్ శనివారం సజావుగా ముగిసింది. ఎంసెట్, ఐసెట్, ఎడ్సెట్, లాసెట్ వంటి ప్రవేశపరీక్షలకు భిన్నంగా ఆఫ్లైన్లో పెన్ను, పేపర్ పద్ధతిలో నిర్వహించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొన్నది. పూర్తిగా కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ నిర్వహించిన ఈ పరీక్ష ఎలాంటి ఆటంకాలు, అవాంతరాలు లేకుండా సజావుగా ముగియడంతో మిగతా ఎనిమిది ప్రవేశ పరీక్షలు సైతం ప్ర శాంతంగా జరుగుతాయనే ధీమా అధికారుల్లో కనిపిస్తున్నది.
రెండుమూడు రోజుల్లో ‘కీ’
శనివారం నిర్వహించిన పాలిసెట్కు 90.30 శాతం విద్యార్థులు హాజరైనట్టు సెట్ కన్వీనర్, సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్ సీ శ్రీనాథ్ తెలిపారు. మొత్తం 1,02,496 విద్యార్థులకుగాను 92,556 మంది పరీక్షకు హాజరైనట్టు పేర్కొన్నారు. రెండుమూడు రోజుల్లో ‘కీ’ ను, రెండువారాల్లోగా ఫలితాలను వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు.