హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా స్పుత్నిక్-వీ డోసులు హైదరాబాద్కు వచ్చాయి. తొలి బ్యాచ్ కింద రష్యా నుంచి 1.50 లక్షలు వచ్చినట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తెలిపింది. టీకాలు సాయంత్రం హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. 12.5 కోట్ల డోసుల స్పుత్నిక్-వీ టీకా ఉత్పత్తి, పంపిణీ కోసం ఇప్పటికే డాక్టర్ రెడ్డీస్ సంస్థ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో గతేడాది సెప్టెంబర్లో ఒప్పందం చేసుకున్నది. స్పుత్నిక్-వీ అత్యవసర వినియోగానికి గత నెల 13న డీసీజీఐ ఆమోదముద్ర వేసింది. అయితే దేశీయంగా టీకాల ఉత్పత్తికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో కరోనా విలయాన్ని దృష్టిలో పెట్టుకొని మొదట రష్యా నుంచి దిగుమతి చేసుకోవాలని డాక్టర్ రెడ్డీస్ నిర్ణయించింది. ఈ మేరకు తొలి బ్యాచ్ టీకాలు భారత్కు వచ్చాయి. రెండో విడుతలో 50 లక్షల టీకాలు వస్తాయని అంచనా. ‘తొలిబ్యాచ్ టీకాలు హైదరాబాద్కు చేరాయి. ఇతర అనుమతులు, తరలింపు పూర్తయ్యి అందుబాటులోకి వచ్చేందుకు కొన్ని రోజులు పట్టవచ్చు’ అని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సర్వీసెస్ సీఈవో దీపక్ సర్పా పేర్కొన్నారు. స్పుత్నిక్-వీ రాకతో ఈ టీకాను వినియోగిస్తున్న 60వ దేశంగా భారత్ నిలిచింది. ‘భారత్లో కరోనాపై పోరులో మేము భాగస్వాములవడం సంతోషంగా ఉన్నది’ అని టీకా తయారీ సంస్థ ట్వీట్ చేసింది.