హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కొవిడ్-19 రోగులతో దవాఖానలు నిండుతున్న వేళ.. వాటిలో ఫైర్ సేఫ్టీ ఏస్థాయిలో ఉన్నదన్న అంశంపై అగ్నిమాపకశాఖ అధికారులు దృష్టిసారించారు. తెలంగాణ ఫైర్ సర్వీసెస్ యాక్ట్, 1999 ప్రకారం 15 మీటర్ల ఎత్తుకు మించి ఉన్న దవాఖానల భవనాలు అగ్నిమాపకశాఖ నుంచి ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తప్పక తీసుకోవాలి. వీటి ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దవాఖానల భవనాలను పరిశీలిస్తున్నట్టు హైదరాబాద్ సెంట్రల్ రీజియన్ రీజినల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య తెలిపారు. మొత్తం 112 హాస్పిటల్ భవనాలకు ఎన్వోసీలు ఇచ్చినట్టు తెలిపారు.
ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన 23 దవాఖానలపై విచారణకు ఆదేశించినట్టు పేర్కొన్నారు. వీటిలో 18 హాస్పిటల్ భవనాలను ఆకస్మిక తనిఖీల్లో గుర్తించగా, మరో ఐదు దవాఖానలకు సాధారణ ప్రక్రియలో భాగంగా గుర్తించినట్టు వెల్లడించారు. మొత్తం 23 భవనాల్లో నాలుగు దవాఖానలకు ఇప్పటికే కోర్టులు జరిమానాలు విధించాయని, మరో 19 భవనాలకు సంబంధించిన కేసులు ట్రయల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. కొవిడ్-19 దవాఖానలు, క్వారంటైన్ సెంటర్లను తరచూ తనిఖీలు చేస్తున్నామని, అగ్నిమాపక నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అగ్నిప్రమాదాలు జరగకుండా పాటించాల్సిన నియమాలు, ప్రమాద సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలపై ఈ నెల 20న అన్ని హాస్పిటల్స్ నిర్వాహకులకు, సెక్యురిటీ సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. గాంధీ దవాఖాన, టిమ్స్ వద్ద నిరంతరం ఫైర్ ఇంజిన్లను అప్రమత్తంగా ఉంచుతున్నట్టు తెలిపారు. దవాఖాన భవనాల్లో మంటలు చెలరేగినా, పొగ వ్యాపించినా ప్రజలు వెంటనే 101 లేదా 99499 91101కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.