పట్టుదలే ఆయుధమై.. అందరికీ ఆదర్శంగా నిలిచి.. ఆడది అంటే అబల కాదు.. సబల అని నిరూపిస్తున్నారు. మానవత్వానికి నిలువెత్తు రూపంగా.. మొక్కవోని ధైర్య సాహసాలతో ముందడుగు వేస్తున్నారు. ఆకాశంలో సగం..అన్నింటా సగం అన్నట్టు సత్తాచాటుతున్నారు. ఇంతింతై ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. అకుంఠిత దీక్షతో అపూర్వ విజయాలు సాధించి.. స్ఫూర్తిగా నిలుస్తున్న మగువలకు మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నది భాగ్యనగరం.
బన్సీలాల్పేట్, మార్చి 7 : నగరంలోని లాలాగూడలో పుట్టి పెరిగిన డాక్టర్ మంచాల విశ్వచైతన్య వరలక్ష్మి బస్తీ బాలికలకు విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారు. తన భర్త డాక్టర్ మంచాల శ్రీనివాస్తో కలిసి 29 ఏండ్లుగా భోలక్పూర్లో ఎంఎస్ హైస్కూల్ను నిర్వహిస్తున్నారు. ఆ రోజుల్లో బస్తీలలో ఉండే నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలకు చదువును దూరం చేయడం, బాల్యవివాహాలు జరిపించడం గమనించారు. దీంతో బాలికా విద్యను ప్రోత్సహించాలని నిర్ణయించుకుని, దంపతులిద్దరూ కలిసి ఆడపిల్లలను తప్పకుండా చదివించాలని ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కలిసి చదువు ప్రాధాన్యతను వివరించారు. తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కల్వకుంట్ల కవిత చేపట్టిన కార్యక్రమాలకు ఆకర్శితురాలై, తెలంగాణ జాగృతిలో చేరి, ఉద్యమంలో క్రియాశీలక భాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2019లో నార్త్ అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో జరిగిన వరల్డ్ స్కౌట్స్ జంబోరిలో తెలంగాణ నుంచి ఏకైక ప్రతినిధిగా హాజరై, ఎనిమిది అంశాల్లో బహుమతులను గెలుచుకున్నారు. ఇటీవల ఢిల్లీలో ‘వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్’ ద్వారా విద్యారంగంలో చేసిన సేవలను గుర్తించి 12 దేశాల నుంచి హాజరైన రాయబారుల చేతులమీదుగా గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. మహిళలపై ఆకృత్యాలను నివారించాలని, యువతులు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కునేలా చైతన్యవంతులు కావాలని ఆకాంక్షిస్తున్నానని ఈ సందర్భంగా వరలక్ష్మి చెప్పారు.
జూబ్లీహిల్స్, మార్చి7: కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్యతరహా (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్) పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. నిమ్స్మేలో శిక్షణ పొంది, వివిధ వ్యాపార రంగాల్లో స్థిరపడిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలతో ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మహిళా సాధికారతపై సెమినార్ నిర్వహిస్తున్నారు. ఉమెన్స్ డే సందర్భంగా నిమ్స్మే సక్సెస్ మహిళల కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ గ్లోరి స్వరూప తెలిపారు. కాగా, నిమ్స్మేలో శిక్షణ పొంది… వ్యాపారవేత్తలుగా రాణిస్తున్న మహిళలు ‘నమస్తేతెలంగాణ’తో తమ మనోగతాన్ని పంచుకున్నారు. అవేమిటో వారి మాటల్లోనే…
మాదాపూర్, మార్చి 7: సమర్థవంతమైన చట్టాలతోనే మహిళలకు భద్రత లభిస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో బిజినెస్ ఉమెన్ ఎక్స్పోలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, కోవె జాతీయ అధ్యక్షురాలు సౌదామినిరావు, హైటెక్స్ నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ … మహిళలను గౌరవించే సంప్రదాయం భారతీయ సంస్కృతి అని చెప్పారు. ఎడ్యుకేషన్, హెల్త్, బిజినెస్, క్రీడలు వంటి రంగాల్లో మహిళలు తమ పాత్రను అద్భుతంగా నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. దేశానికి క్రీడల్లో అధికంగా పతకాలు తీసుకొచ్చిన ఘనత ఆడబిడ్డలేదేనని అన్నారు. మహిళా సాధికారతతోనే సమాజ ప్రగతి సాధ్యమవుతుందనే ప్రగాఢ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
నిమ్స్మేలో చేసిన పీజీ డిప్లొమాతో మష్రూమ్ వ్యాపార రంగంలో స్థిరపడ్డాను. శామీర్పేటలోని సొంత స్థలంలో మష్రూమ్స్ ఉత్పత్తులను చేపడుతూ వివిధ వర్గాల రైతుల నుంచి వాటిని సేకరిస్తూ వ్యాపార రంగంలో నిలదొక్కుకున్నాను. -హుమేరా నౌషీన్, పారిశ్రామికవేత్త
2010 నుంచి ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తూ నిమ్స్మేలో 2018 లో ఇస్తున్న ఉచిత శిక్షణకు హాజరయ్యాను. కొవిడ్ నేపథ్యంలో పాఠశాలలు మూతపడడంతో 45 రకాల డ్రైఫ్రూట్స్, మిల్లెట్స్, నట్స్, బెర్రీస్ తదితర ఉత్పత్తులను ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తున్నాను. -ఆశాలత..ఆన్లైన్ మార్కెటింగ్..
న్యూట్రిషియనిస్ట్గా జీవితంలో స్థిరపడాలనుకున్న సమయంలో నిమ్స్మేలో బేకింగ్ కోర్సులో శిక్షణ పొందాను. నగరంలోని క్లౌడ్ కిచెన్ సంస్థను స్థాపించి ఆన్లైన్ వ్యాపారాలను ప్రారంభించాను. -శుభంగి తమల్వార్.. క్లౌడ్ కిచెన్..
సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ):మేయర్ హోదాలో మహిళా దినోత్సవంలో పాల్గొంటున్నందుకు ఒక మహిళగా తనకు ఎంతో గర్వంగా ఉందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె మాట్లాడుతూ ‘సమాజాభివృద్ధిలో మహిళల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించుకోవడానికి, వారి కృషిని గౌరవించుకోవడానికి, విజయాలను సన్మానించుకోవడానికి ప్రతి ఏటా మహిళా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకొంటున్నాం. ఇవి మహిళలకు మరింత స్ఫూర్తినిచ్చి వారు ఉన్నత స్థాయికు చేరుకునేలా చేస్తాయి’ అని అన్నారు.
మాదాపూర్, మార్చి 7: మాదాపూర్లోని హైటెక్స్ ప్రాంగణంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భాగ్యనగర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 3కె, 5కె, 10కె రన్ ఉత్సాహంగా సాగింది. తొలుత ఈ రన్ను బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ, అడిషనల్ డీసీపీ లావణ్య, నటి రాశీఖన్నా, కమర్షియల్ పైలట్ అజ్మీరాబాబి, కపిల్ మిశ్రా తదితరులు హాజరై జెండా ఊపి ప్రారంభించారు. చిన్నారులకు మొదటగా 3 కె, యువతకు 5కె, 10కె రన్ను నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్పొరేటర్ గంగాధర్రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు రవికుమార్ యాదవ్, ఫౌండేషన్ గౌరవ సలహాదారు రాధాకృష్ణయాదవ్, బాలకుమార్, నాగరాజు యాదవ్ పాల్గొన్నారు.
బన్సీలాల్పేట్, మార్చి 7 : గాంధీ దవాఖాన ప్రసూతి విభాగం హెచ్వోడీగా ఉన్న డాక్టర్ జి.మహాలక్ష్మి సారథ్యంలో ఏడాది కాలంలో కరోనా సోకిన 950 మంది గర్భిణులకు పురుడు పోశారు. అందులో 600 సిజేరియన్ శస్త్రచికిత్సలు నిర్వహించారు. మెటర్నిటీ విభాగంలో పనిచేసే వైద్యులు, నర్సులు, సిబ్బంది సమష్టిగా కృషి చేయడం వల్లే ఇది సాధ్యపడిందని డాక్టర్ మహాలక్ష్మి అన్నారు.
రవీంద్రభారతి, మార్చి 7 : శ్రీసాయి అలేఖ్య సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చాకలి ఐలమ్మ, స్త్రీశక్తి పురస్కారాలు, మహిళా కార్పొరేటర్లకు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రసంగిస్తూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు.హైకోర్టు న్యాయవాది వెంకటేశ్వరి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రిటైర్డ్ డీజీపీ గోపీనాథ్రెడ్డి, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాచిగూడ, మార్చి 7: మహిళలతోనే దేశాభివృద్ధి సాధ్యమని తెలంగాణ ఫస్ట్ కమర్షియల్ ఉమెన్ పైలెట్ అజ్మీరాబాబి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డీవీఎం అపర్ణ కల్యాణి అధ్యక్షతన ఆదివారం కాచిగూడ బస్ టర్మినల్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పైలెట్ అజ్మీరాబాబి, హైదరాబాద్ రిజియన్ ఆర్ఎం సీహెచ్ వెంకన్న హాజరయ్యారు. కార్యక్రమంలో హోటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ వాణి, కాచిగూడ డిపో మేనేజర్ ఎన్.శ్రీనివాస్రావు, బర్కత్పుర మేనేజర్ పి.వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ రచయిత్రి బండి నీరజ రచించిన ఎంపవర్ టు ట్రాన్స్ ఫార్మ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మా రెడ్డి
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 7: పోరాట పటిమలో ముఖ్యమంత్రి కేసీఆరే తనకు ఆదర్శమని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ని ఓటములు ఎదురైనా సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందన్నారు. మహిళలు స్వశక్తితో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను మహిళలకే కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని కొనియాడారు.
బన్సీలాల్పేట్, మార్చి 7 : పద్మారావునగర్కు చెందిన డాక్టర్ సరోజిని (75) వైద్య సేవలు కొనసాగిస్తూనే, ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. 1972లో గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 43 ఏండ్లుగా బర్కత్పురాలోని ఉడ్ల్యాండ్స్ హాస్పిటల్లో గైనకాలాజిస్ట్గా పనిచేస్తున్నారు. దాదాపు 80 వేల మందికి కాన్పులు చేశారు. తండ్రి కోరిక మేరకు పేద ప్రజలకు వైద్యం అందించాలనే సంకల్పంతో అనేక గ్రామాల్లో వందలాది ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. తన భర్త ఆర్.పీ.భగవాన్తో కలిసి రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వెస్ట్లో చేరి 50 పాఠశాలల్లో బాలికలకు శారీరక పరిశుభ్రత గురించి వివరించారు. ప్రయాణికులు కరోనా బారిన పడకుండా1500 ఆటోలకు ప్లాస్టిక్ పార్టీషన్ కవర్లను పంపిణీ చేశారు. వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వయోవృద్ధులకు ‘స్వచ్ఛ్ మా’ పేరుతో ఉచితంగా వెయ్యి అడల్ట్ డైపర్లను పంపిణీ చేశారు. నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మూడు వందలమంది సన్నిహితులతో నేత్రదానం చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ ఆపద, పేదరికంలో ఉన్న వారికి తమ వంతు సహాయం అందించాలని తన తండ్రి చెప్పారని, అందుకే తనకు చేతనైన సాయం అందిస్తానని డాక్టర్ సరోజిని తెలిపారు.
ఉప్పల్, మార్చి 7 : ‘బాగా కష్టపడాలి బిడ్డా’ అన్న అమ్మ మాటలే స్ఫూర్తిగా విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపి.. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఉప్పల్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ శివరాణి. ఘట్కేసర్కు చెందిన ఆమెది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. శివరాణికి అక్క, అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. తండ్రి కిష్టయ్య ఆమె ఆరో తరగతిలో ఉన్నప్పుడే చనిపోయారు. తల్లి బాలమణి వ్యవసాయ కూలీగా పనిచేశారు. ఆ డబ్బులతోనే కుటుంబాన్ని పోషిస్తూ, పిల్లలను చదివించారు. ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన శివరాణి పదో తరగతిలో మండలంలో ఫస్ట్ వచ్చారు. దీంతో ఇంటర్లో ఫీజు లేకుండానే ఫ్రీ సీటు ఇచ్చారు. ఆ తర్వాత బీటెక్, ఎంటెక్ పూర్తి చేశారు. ప్రభుత్వ స్కాలర్షిప్లతో విద్యాభాస్యం పూర్తయింది. ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. 2018లో ఉప్పల్ పోలీస్స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చారు. క్రైం అండ్ క్రిమినెల్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిస్టమ్ అప్పగించారు. పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులకు చెందిన ఎఫ్ఐఆర్ నుంచి చార్జిషీట్ వరకు అన్ని దశల్లో జరిగిన నేర పరిశోధనలకు సంబంధించిన ప్రతులను సీసీటీఎన్ఎస్లో అప్లోడ్ చేయడంలో ప్రతిభ చూపారు. ఉత్తమ సేవకు శివరాణి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అవార్డు అందుకున్నారు. జాబ్లో చేరిన నాటి నుంచి అవార్డు వరకు సుమారు మూడు వేలకు పైగా డేటాను అప్డేట్ చేసినట్లు చెప్పిన శివరాణి.. అమ్మ మాటలే తనకు స్ఫూర్తి అని చెప్పింది. ‘పోలీస్ శాఖలో పనిచేయడానికి మహిళలు చాలామంది ఆలోచిస్తారు. కానీ అలాంటి భయం అవసరంలేదు. మహిళలను ప్రోత్సహించడానికి పోలీస్శాఖలో 33 శాతం రిజర్వేషన్ తీసుకువచ్చారు. ఎస్సై కోసం ప్రయత్నిస్తున్నా. సాధిస్తాననే నమ్మకం ఉంది’. అని ధీమా వ్యక్తం చేశారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్తులో ఆదివారం సాయంత్రం వివిధ రంగాల్లో నిష్ణాతులైన పలువురు మహిళలకు నవరత్న మహిళా పురస్కారాలు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, ప్రముఖ సంఘసేవకులు డాక్టర్ చిల్లా రాజశేఖరరెడ్డి, సాహితీవేత్తలు గదిబండ వెంకటరెడ్డి, ఆర్. నరేశ్, సీహెచ్.రవికుమార్ రెడ్డి పాల్గొని పురస్కార గ్రహీతల సేవలను కొనియాడి ఘనంగా సత్కరించారు.
బన్సీలాల్పేట్, మార్చి 7 : సికింద్రాబాద్ తుకారాంగేట్కు చెందిన ప్రైవేటు ఉద్యోగిని ఓ.పావనీ 2012లో స్కై ఫౌండేషన్లో చేరారు. తన జీతం నుంచి 40 శాతం సొమ్మును సామాజిక సేవకు వినియోగిస్తున్నారు. అన్నదానం, పర్యావరణ, విద్య వంటి సుమారు 800 సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్తుతం స్కై ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. రోడ్ల పక్కన ఉండే దిక్కులేని వారి కోసం ఓ ఆశ్రమం నెలకొల్పాలనే సంకల్పం తనకున్నదని, వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానని పావనీ చెప్పారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజికవేత్త, డాక్టర్ కొత్త కృష్ణవేణి బేగంపేటలోని తన స్వగృహంలో ‘పనివారు కాదు మనవారు’ అనే నినాదంతో ఇండ్లలో పనిచేసే మహిళలు, పారిశుధ్య, చేనేత కార్మికులు, రంగస్థల మహిళా కళాకారులతో వేడుకలు నిర్వహించారు. వారందరికీ స్వయంగా వండి భోజనాలు సమకూర్చారు.
దివంగత సినీనటి ప్రత్యూష పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి సమాజ సేవకు అంకితమయ్యారు ఆమె తల్లి సరోజాదేవి. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, కుటుంబాల్లో నెలకొంటున్న వేధింపులు, పురుషాధిక్యతలను నుంచి మహిళలు ఏవిధంగా సమాజంలో ముందుకు సాగాలన్న ఉద్దేశంతో నెలకొల్పిన ప్రత్యూష ట్రస్టు ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని, షీటీమ్స్తో అతివలకు భద్రత ఉంటున్నదని సరోజాదేవి చెప్పారు. -మణికొండ