హైదరాబాద్ : రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు వారు వెల్లడించారు. సీఎం కేసీఆర్ తమ డిమాండ్లన్నీంటిని నెరవేరుస్తారన్న నమ్మకం ఉందని జూడాలు ధీమా వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించడంతో రోగులు సైతం ఊపిరిపీల్చుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ కష్టకాలంలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునివ్వడం సరికాదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
జనాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విధులకు హాజరుకావాలని కోరారు. సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనం 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్లో వైద్యాధికారులతో సీఎం కేసీఆర్ బుధవారం కరోనా, ఇతర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. సీఎం హామీ మేరకు జూడాలు 24 గంటల్లోనే సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.