పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మందుల అపహరణకు యత్నం
సెక్యూరిటీ గార్డు తనిఖీలో బట్టబయలు
డీవైసీఎంవో కిరణ్ రాజ్ విచారణ
యైటింక్లయిన్ కాలనీ, మార్చి 30: ఆర్జీ-2 ఏరియాలోని సెక్టార్-3 డిస్పెన్సరీలో ఓ ఉద్యోగి పీపీఈ కిట్లు, మందులు, మాస్కులు, శానిటైజర్లు గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తూ సెక్యూరిటీ సిబ్బందికి అడ్డంగా దొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని సింగరేణి ఏరియా దవాఖాన డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజు మంగళవారం విచారణ చేపట్టారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. డిస్పెన్సరీలో పనిచేస్తున్న ఓ నర్సు సోమవారం దవాఖానలోని పీపీఈ కిట్లు, శానిటైజర్స్, మాస్కులు, మందులను తన కారులో తరలించేందుకు యత్నించింది. సెక్యూరిటీ సిబ్బంది అనుమానం వచ్చి కారును తనిఖీ చేయగా, పీపీఈ కిట్లు, తదితర సామగ్రి దొరుకగా, స్వాధీనం చేసుకున్నారు.
కరోనా కాలంలో కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో యాజమాన్యం లక్షలాది రూపాయలతో సామగ్రిని తెప్పిస్తే రోగులకు వినియోగించకుండా తమ స్వలాభం కోసం బయటికి తరలించడం నిబంధనలకు విరుద్దమని డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, డిస్పెన్సరీలో అనుభవజ్ఞులైన డాక్టర్లను, సిబ్బందిని 24 గంటలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని డీవైసీఎంవో కిరణ్ రాజ్ను గుర్తింపు సంఘం డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, చెరుకు ప్రభాకర్రెడ్డి కోరారు. డిస్పెన్సరీకి వచ్చిన ఆయనను కలిసి పలు సమస్యలపై విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కార్మికులు, కార్మిక కుటుంబాలు వైద్యం కోసం డిస్పెన్షరీకి వచ్చినప్పుడు డాక్టర్లు సరిగా స్పందించడం లేదని, అత్యవసర సమయాల్లో సత్వరమే స్పందించకపోవడం వల్ల బాధితులు మృతిచెందిన సందర్భాలున్నాయని పేర్కొన్నారు.