కంది, జూలై 10: రాజీ మార్గంతోనే కక్షిదారులకు ఆయా కేసుల్లో సత్వరన్యాయం కలుగుతుందని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీ.పాపిరెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కోర్టులో లోక్అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కక్షిదారుల కోసం 21 బెంచీలను ఏర్పాటు చేసి, ఆయా కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి మాట్లాడుతూ కక్షిదారుల, న్యాయవాదులు, పోలీసులు అధికారులందరూ తమవంతు కృషి చేసి రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ అవార్డు తీర్పును అప్పీల్ కూడా చేసుకోకుండా ఉండే వీలు ఉందని స్పష్టం చేశారు.
కాలు కోల్పోయిన బాధితుడికి రూ.11 లక్షలు
కంది గ్రామానికి చెందిన దశరథ్ ఇటీవకాలంలో ఓ ప్రమాదంలో గాయపడగా, ఎడమ కాలు కింది భాగాన్ని తీసివేశారు. అయితే బాధితుడికి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి వాహన ప్రమాద నష్టపరిహారం కింద శనివారం రూ.11 లక్షల చెక్కును అందజేశారు. దీంతో అతడు న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలియజేశాడు.
లోక్ అదాలత్లో పరిష్కరించిన కేసుల వివరాలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లో పరిష్కరింపబడిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. సివిల్ కేసులు 40, మోటారు వాహన నష్టపరిహార కేసులు 20, క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు 6100, చెక్ బౌన్స్ కేసులు 46, కుటుంబ తగాదా కేసులు 2, విద్యుత్ చౌర్యం కేసులు 1800 ఇలా మొత్తం 8009 కేసులను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లోక్అదాలత్లో పరిష్కరించారు. ఈ కేసుల్లో నష్టపరిహారం సొమ్ము రూ.1.10 కోట్లు, పరిహారం రుసుము రూ.3 లక్షలు, రికవరీ చేసిన సొమ్ము రూ.11.60 లక్షలు. కార్యక్రమంలో ఏడో అదనపు జిల్లా న్యాయమూర్తి ఏ.కర్ణకుమార్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్ ఆశాలత, అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ఎం.కల్పన, స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి నిర్మల, ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి దేవేంద్రబాబు, బార్ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది నర్సింగ్రావు, సీనియర్ న్యాయవాదులు, పోలీసులు అధికారులు, బ్యాంక్ అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు.