హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కట్టడికి గ్రామస్థుల భాగస్వామ్యంతో సర్పంచ్లు తీసుకుంటున్న జాగ్రత్తలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలకేంద్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో గ్రామస్థుల సౌకర్యార్థం సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి జడ్పీహైస్కూల్ను హోం ఐసొలేషన్ కేంద్రంగా మార్చారు. పాఠశాల ఆవరణలో హైపోక్లోరైడ్తో పిచికారీతోపాటు పినాయిల్, బ్లీచింగ్తో పారిశుద్ధ్ద్య చర్యలు చేపట్టారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకొంటున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తే లక్షణాల ఆధారంగా కరోనా పరీక్ష చేయించిన తర్వాతే గ్రామంలోకి అనుమతిస్తున్నారు.
గ్రామస్థుల ఆరోగ్యమే ముఖ్యం..
గ్రామంలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో జడ్పీ స్కూల్లో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటుచేశాం. ఇక్కడ ఉన్నవారికి ప్రభుత్వమే మందులు అందజేస్తున్నది. వైద్యుల పర్యవేక్షణతోపాటు పోలీసు రక్షణ కూడా కల్పించాం. పంచాయతీ నుంచి భోజనాలు అందిస్తున్నాం. గ్రామస్థుల ఆరోగ్యమే ముఖ్యమనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. – అనుముల శ్రీనివాస్రెడ్డి, త్రిపురారం సర్పంచ్, నల్లగొండ జిల్లా