సిద్దిపేట, అక్టోబర్ 14: బతుకమ్మ పండుగ తెలంగాణకే సొంతమని, పువ్వులను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి మనదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలో గురువారం జరిగిన సద్దుల బతుకమ్మ సంబురాల్లో మంత్రి హరీశ్రావు సతీసమేతంగా పాల్గొన్నారు. ముందుగా తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో సతీమణి శ్రీనిత, కుమార్తె వైష్ణవితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం పలుచోట్ల సంబురాలకు హాజరయ్యారు. రాత్రి కోమటి చెరువు వద్ద జరిగిన సద్దుల సంబురాల్లో మంత్రి దంపతులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అన్నారు. కోమటి చెరువు వద్ద లేజర్ షో, సంగీత విభావరి, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.