హైదరాబాద్ : ఆగస్టు నాటికి ప్రతీ గ్రామ పంచాయతీకి ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించనున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ బోర్డు సమావేశం గురువారం జరిగింది. ఈ భేటీలో మంత్రి కేటీఆర్తో పాటు ఐటీ, ఆర్థికశాఖ, మిషన్ భగీరథ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..టి-ఫైబర్ పరిధిని పట్టణ ప్రాంతాలకూ విస్తరిస్తామన్నారు. అధికారులు జీహెచ్ఎంసీలో సర్వే చేసి నివేదిక ఇవ్వాలన్నారు. పట్టణాల్లోని ప్రతి ఇంటికి బ్రాడ్ బ్యాండ్ చేరుకోవాలన్నారు.
జూన్ నుంచి 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు టి-ఫైబర్ కనెక్షన్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. రైతు వేదికలను టి-ఫైబర్తో అనుసంధానిస్తామన్నారు. ఈ క్రమంలో ప్రయోగాత్మకంగా ఇప్పటికే 5 రైతు వేదికలను టి-ఫైబర్తో అనుసంధానించినట్లు చెప్పారు. ప్రతి రైతుకూ ఇంటర్నెట్ ఫలాలు అందించాలన్నారు.మిషన్ భగీరథ పనులు పూర్తయిన గ్రామీణ ప్రాంతాల్లో టి-ఫైబర్ పనులు పెద్దఎత్తున కొనసాగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.